
హైదరాబాద్: ఇంగ్లాండ్తో ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో తాను సాధించిన సెంచరీ తన టెస్టు కెరీర్లో రెండో అత్యుత్తమ టెస్టు సెంచరీ అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. 2014లో జరిగిన ఇంగ్లాండ్ పర్యటనలో 13.40 యావరేజితో తీవ్రంగా నిరాశ పరిచిన కోహ్లీ ఈసారి మాత్రం చెలరేగాడు.
100 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోవడంతో అప్పటికే క్రీజులో ఉన్న కోహ్లీపై తీవ్ర ఒత్తిడి పడింది. కానీ కోహ్లీ దానిని దరిచేరనీయలేదు. సహచరులంతా ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నా ఏమాత్రం తత్తరపాటుకు లోనుకాలేదు. మొక్కవోని దీక్షతో బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ 172 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 100 పరుగులు నమోదు చేశాడు.
ఇది కోహ్లీకి ఇంగ్లండ్ గడ్డపై తొలి టెస్ట్ సెంచరీ కాగా.. కెరీర్లో 22వ సెంచరీ. మ్యాచ్ అనంతరం బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో కోహ్లీ మాట్లాడుతూ "ఖచ్చితంగా చెప్పలేను. ఈ సెంచరీ అడిలైడ్లో సెంచరీ తర్వాత రెండో స్థానంలో నిలుస్తుందని అనుకుంటున్నా. అడిలైడ్లో చేసిన సెంచరీ ఎప్పటికీ నాకు ప్రత్యేకమే. ఎందుకంటే రెండో ఇన్నింగ్స్లో భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో సెంచరీ సాధించా. అప్పుడు నాకు పూర్తి క్లారిటీ ఉంది" అని కోహ్లీ పేర్కొన్నాడు.
నాలుగేళ్ల క్రితం అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో విరాట్ కోహ్లీ 141 పరుగులతో చెలరేగాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ టెస్టులో విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా పేసర్లు మిచెల్ జాన్సన్, రేయాన్ హారిస్, పీటర్ సిడ్డిల్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ-జాన్సన్ల మధ్య మాటల యుద్ధం నడిచింది.
కాగా, ఈ మ్యాచ్లో తనకు మద్దతుగా నిలిచిన టెయిలెండర్లు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్లపై కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. చివరి రెండు వికెట్లకు టీమిండియా 97 పరుగులు జోడించిన సంగతి తెలిసిందే. నాలుగు ఓవర్ల తేడాలో అశ్విన్, షమీ (2) ఔటైనా.. ఇషాంత్ 9 ఓవర్లు పాటు కోహ్లీకి అండగా నిలిచాడు. బ్యాట్-ప్యాడ్తో బంతులు వృథా చేస్తూ పోయాడు.
మధ్యలో అండర్సన్ బంతికి ఎల్బీ అయినా రివ్యూలో నాటౌట్గా తేలింది.. ఇక కోహ్లీ సెంచరీకి చేరువ అయిన సమయంలో ఇషాంత్ పెవిలియన్కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్ (1) కోహ్లీకి మద్దతుగా నిలవగా ఎక్కువగా స్ట్రయికింగ్ చేస్తూ సింగిల్స్ కూడా తీయకుండా 172 బంతుల్లో కెరీర్లో 22వ సెంచరీ పూర్తి చేశాడు.
సెంచరీ అనంతరం కోహ్లీ తనదైన శైలిలో దూకుడుని ప్రదర్శించాడు. చెత్త బంతులు ఫోర్లు, సిక్సర్లుగా మలుస్తూ స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ఆధిక్యం క్రమంగా తగ్గుతున్న తరుణంలో రషీద్ బంతికి భారీ షాట్ ప్రయత్నించి ఔటయ్యాడు. చివరి వికెట్కు కోహ్లీ 57 పరుగులు జోడిస్తే అందులో ఉమేశ్ చేసింది ఒక్క పరుగు కావడం విశేషం.
దీంతో భారత్ 274 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ను ముగించింది. దీనిపై విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "చివర్లో కూడా అద్భుత ప్రదర్శన చేశాం. ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ చాలా చక్కగా బ్యాటింగ్ చేశారు. వారిద్దరి ప్రదర్శన నిజంగా అద్భుతం. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ చేసిన పరుగులు వరకు చేరుకునేందుకు ఈ ఇద్దరూ అందించిన మద్దతు అమోఘం" అని కోహ్లీ కొనియాడాడు.
"చివర్లో ఈ ఇద్దరూ నాకు ఎంతో మద్దతుగా నిలిచారు. వారిద్దరి పట్ల నేనెంతో పూర్తి విశ్వాసంతో ఉన్నా. టెయిలెండర్లు అయిన ఇషాంత్, ఉమేశ్ చాలా చక్కగా రాణించారు. వారిద్దరూ రాణించడం అక్కడ ఎంతో కీలకం. వారిద్దరిని చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది" అని కోహ్లీ పేర్కొన్నాడు.