
హైదరాబాద్: ఆరు వన్డేల సిరిస్ను 5-1తో ముగించడమే తమ ముందున్న లక్ష్యమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. పోర్ట్ ఎలిజబెత్ వేదికగా మంగళవారం జరిగిన ఐదో వన్డేలో ఆతిథ్య సఫారీ జట్టుపై 73 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 4-1తో కైవసం చేసుకుని కోహ్లీసేన చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
ఐదో వన్డేలో విజయం సాధించడంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. కెప్టెన్గా 48 వన్డే మ్యాచ్లకు నాయకత్వం వహించిన కోహ్లీకి ఇది 37వ విజయం. అంతకాదు టీమిండియా వరుసగా 9 ద్వైపాక్షిక వన్డే సిరీస్లను గెలుచుకొంది. ఐదో విజయానంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడాడు.
సిరీస్ గెలిచాం కదా అని సంబరపడిపోకుండా చివరి వన్డేను సైతం గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. 'చాలా చాలా సంతోషంగా ఉంది. గెలిస్తే చరిత్ర సృష్టిస్తామని జట్టులో అందరికి తెలుసు. విజయం కోసం చాలా కష్టపడ్డాం. సాధించాం.. ఇది మాకు మరో సమిష్టి ప్రదర్శనతో దక్కిన విజయం. మాపై ఒత్తిడి లేకపోవడంతోనే సిరీస్ గెలిచామనే విషయం అర్థమైంది' అని కోహ్లీ అన్నాడు.
'జోహన్నెస్బర్గ్ టెస్టు విజయం మాలో ఉత్తేజాన్ని కలిగించింది. ఈ విజయానంతరం మేము మా ఆటతీరును సమీక్షించుకున్నాం. అది అలానే కొనసాగిస్తూ 4-1తో సిరీస్ గెలిచి కొత్త చరిత్రను సృష్టించాం. ముఖ్యంగా జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు స్థిరంగా రాణించారు. వారు ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు' అని కోహ్లీ తెలిపాడు.
'స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. గెలిచాం కదా అని చివరి వన్డేను తేలికగా తీసుకోం. ఇప్పుడు మా లక్ష్యం 5-1తో సిరీస్ ముగించడమే. అయితే, ఇప్పటి వరకు అవకాశం రాని ఆటగాళ్లకు చివరి వన్డేలో రావచ్చు. ఏది ఏమైన గెలవడమే మా ప్రాధాన్యత. దాని కోసం ఏమైనా చేస్తాం' అని కోహ్లీ అన్నాడు.
ఐదో వన్డేలో రోహిత్ శర్మ సెంచరీ నమోదు చేయడంలో సఫారీ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరుని నమోదు చేశాడు. ఐదో వన్డేలో రోహిత్ శర్మ 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 115 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా గడ్డపై ఏ ఫార్మాట్లో అయినా అతడికిదే అత్యధిక స్కోరు. సఫారీ గడ్డపై రోహిత్ శర్మ సెంచరీ చేయడం ఇదే తొలిసారి.
అంతకముందు రోహిత్ శర్మ అత్యధిక స్కోరు 53గా ఉంది. అది కూడా టీ20ల్లో సాధించాడు. వన్డేల్లో అత్యధికంగా 23 పరుగులు, టెస్టుల్లో 47 పరుగులు చేశాడు. ఆరు వన్డేల సిరిస్లో చివరిదైన ఆరో వన్డే సెంచూరియన్ వేదికగా శుక్రవారం జరగనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.