ఆసీస్ బౌలర్లను సమర్ధంగా
ఈ మ్యాచ్లో ఛటేశ్వర్ పుజారా ఆసీస్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొని సెంచరీ సాధించిన తీరుపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ మ్యాచ్లో మొత్తం 280 బంతులను ఎదుర్కొన్న పుజారా 10 ఫోర్ల సాయంతో తన కెరీర్లో 17వ సెంచరీ సాధించాడు. ఆసీస్పై పుజారాకు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం.
విహారి ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా
ఓపెనర్ హనుమ విహారీ విఫలమైన తర్వాత క్రీజులోకి వచ్చిన పూజారా వికెట్ను కాపాడుకునేందుకు చాలానే కష్టపడ్డాడు. మయాంక్ పరుగుల వేగానికి సహకారాన్ని అందించాడు. ఆ తర్వాత మయాంక్ అవుట్ అనంతరం బ్యాటింగ్కు దిగిన కోహ్లీతో పాటు నిదానంగా పరుగులు జోడించాడు.
సెంచరీతో సరికొత్త రికార్డులు
నిదానంగా ఇన్నింగ్స్ను కొనసాగించిన బ్యాట్స్మన్ పూజారా సెంచరీతో సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. ఆటలో రెండో రోజైన గురువారం ఓవర్నైట్ వ్యక్తిగత స్కోరు 68తో బ్యాటింగ్ని కొనసాగించిన పుజారా 280 బంతులు ఆడి 10 ఫోర్ల సాయంతో 100 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
ఫోర్తో సెంచరీ సాధించిన పుజారా
ఇన్నింగ్స్ 114వ ఓవర్ వేసిన స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్లో క్రీజు వెలుపలికి వచ్చి మరీ.. మిడాఫ్ దిశగా బౌండరీ బాదిన పుజారా.. కెరీర్లో 17వ టెస్టు సెంచరీని పూర్తి చేసుకోగలిగాడు. ఈ మ్యాచ్లో సెంచరీ సాధించడం ద్వారా పుజారా సరికొత్త రికార్డుల్లో నిలిచి దిగ్గజాల సరసన చేరాడు. ఇప్పటి వరకు మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో సచిన్ టెండూల్కర్ (1999), వీరేంద్ర సెహ్వాగ్ (2003), విరాట్ కోహ్లి (2014), అజింక్య రహానె (2014) మాత్రమే సెంచరీలు సాధించారు.