ఫామ్లో లేని బ్యాటర్లు
ఇటీవల జరిగిన వన్డే, టీ20 సిరీసుల్లో భారత్ ఆధిపత్యం చెలాయించినా.. టెస్టుల్లో ఆ పరిస్థితి కంటిన్యూ అవడం కష్టం. గతేడాది చివర్లో జరిగిన బంగ్లాదేశ్ టెస్టులే దీనికి నిదర్శనం. భారత బ్యాటర్లలో రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ మినహా మిగతా బ్యాటర్లు అంతగా ఆకట్టుకోలేదు. శుభ్మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా ఒక ఇన్నింగ్స్లో రాణించినా.. మిగతా ఇన్నింగ్సుల్లో విఫలమయ్యారు.
ఇలాంటి సమయంలో స్పిన్ పిచ్లపై ఆడటం టీమిండియా బ్యాటర్లకు కూడా చాలా కష్టంగా మారడం ఖాయం. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (265) కన్నా రవిచంద్రన్ అశ్విన్ (270) ఎక్కువ పరుగులు చేశాడంటేనే టీమిండియా బ్యాటర్లు ఏమాత్రం ఫామ్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
లియాన్ మామూలోడు కాదు..
2022లో భారత్ మొత్తం ఏడు టెస్టులు ఆడింది. వీటిలో మూడింట ఓటమిపాలైంది. వీటిలో రెండు విజయాలు బంగ్లాపై సాధించినవే. కానీ వీటిలో భారత్ ఆధిపత్యం చెలాయించలేదు. అతి కష్టం మీద గెలిచింది. ముఖ్యంగా స్పిన్ను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. అలాంటిది ఇప్పుడు స్పిన్ పిచ్ తయారు చేస్తే.. ఆసీస్ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్.. భారత్ను తెగ ఇబ్బందిపెట్టేందుకు రెడీగా ఉన్నాడు.
కోహ్లీని కూడా లియాన్ ఇది వరకు చాలా ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. భారత్పై లియాన్ రికార్డు చూస్తేనే.. స్పిన్ ట్రాక్పై అతను ఎంతలా సమస్యలు సృష్టిస్తాడో అర్థం చేసుకోవచ్చు. అతను భారత్పై మొత్తం 22 టెస్టులు ఆడి 94 వికెట్లు తీసుకున్నాడు. వీటిలో ఏడుసార్లు ఐదు వికెట్లు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే భారత గడ్డపై ఆడిన ఏడు మ్యాచుల్లో 34 వికెట్లు తీసుకున్న అతను మూడుసార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు.
స్పిన్ మనకూ సమస్యే..
స్వదేశంలో జరిగిన టెస్టు సిరీసుల్లో భారత జట్టు అద్భుతమైన రికార్డు నెలకొల్పింది. 2012 నుంచి స్వదేశంలో జరిగిన మ్యాచుల్లో కేవలం నాలుగింటిలోనే భారత్ ఓడింది. అయితే ఈ ఓటములను జాగ్రత్తగా గమనిస్తే ప్రత్యర్థి స్పిన్ బౌలింగ్ బలంగా ఉండటం కనిపిస్తుంది. దీని వల్లనే భారత్ ఈ మ్యాచులు ఓడిందనడం అతిశయోక్తి కాదు.
2012 నవంబరులో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడింది. ఆ మ్యాచ్లో ఎడం చేతి వాటం స్పిన్నర్ మోంటీ పనేసర్ ఏకంగా 11 వికెట్లు తీసుకోగా.. గ్రేస్ స్వాన్ 8 వికెట్లతో రాణించాడు. అదే సిరీస్లో కోల్కతాలో జరిగిన మ్యాచులో పనేసర్ నాలుగు వికెట్లు తీసుకోవడంతో.. తొలి ఇన్నింగ్స్లోనే భారత్ ఆత్మరక్షణలో పడింది. ఇక 2017లో ఆస్ట్రేలియాతో రాంచీలో జరిగిన మ్యాచ్లో స్టీవ్ ఓకీఫీ ఏకంగా 12 వికెట్లతో రాణించడంతో భారత్ ఓటమిపాలైంది.
చివరగా భారత్ స్వదేశంలో ఓడింది 2021లో. చెన్నై వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఈ మ్యాచ్లో ఆఫ్ స్పిన్నర్ డామ్ బెస్.. తొలి ఇన్నింగ్స్లోనే నాలుగు వికెట్లు తీసుకోగా.. మరో స్పిన్నర్ జాక్ లీచ్ రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లతో రాణించాడు. ఈ లెక్కన స్పిన్ పిచ్లు తయారు చేస్తే అవి భారత్కే సమస్యగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.