ముంబై: బీసీసీఐ అధికారులపై భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. భారత దేశవాళీ క్రికెట్లో ప్రతిష్ఠాత్మకమైన రంజీ ట్రోఫీ స్థాయిని బీసీసీఐ అధికారులు రోజురోజుకి దిగజారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. భారత్-ఎ జట్టు పేరుతో అగ్రశ్రేణి ఆటగాళ్లను రంజీ ట్రోఫీకి దూరం చేస్తున్నారన్నారు. దేశవాళీ సీజన్ సమయంలో ప్రపంచంలోని ఏ జట్టు కూడా విదేశీ పర్యటనలకు ఆటగాళ్లను పంపించదు. ఐపీఎల్ జరిగే సమయంలో 'ఎ' జట్టు పర్యటనలు, అండర్-19 సిరీస్లు ఏర్పాటు చేస్తారా? అని బీసీసీఐని గవాస్కర్ ప్రశ్నించారు.
బీబీఎల్లో ఊహించని ఘటన.. ఎప్పుడూ చూడని రీతిలో రనౌట్ (వీడియో)!!
తాజాగా సునీల్ గావస్కర్ మాట్లాడుతూ... 'మన ఆటగాళ్లు ఎక్కువగా క్రికెట్ ఆడుతూ అలిసిపోతున్నారని గత కొన్నేళ్లుగా తరచూ వింటున్నాం. అయితే ఐపీఎల్ సమయంలో మాత్రం వారికి అలసట రాదు. ఇలా చేసి రంజీ ట్రోఫీ స్థాయిని తగ్గిస్తున్నారు. ద్వైపాక్షిక ఒప్పందం ఉంది కాబట్టి కోహ్లీసేన న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. భారత్-ఎ జట్టు కూడా కివీస్కు పంపాల్సిన అవసరం ఏంటి?. దీంతో ప్రతీ రాష్ట్ర జట్టులో కీలక ఆటగాళ్లు రంజీ ట్రోఫీకు దూరమై.. టోర్నీ కళ తప్పుతోంది. మరోవైపు అండర్-19 ప్రపంచకప్కు కూడా ఆటగాళ్లు దక్షిణాఫ్రికా వెళ్లడంతో నాకౌట్లో కొన్ని జట్లు బలహీనంగా మారాయి' అని అన్నారు.
'భారత సీనియర్ జట్టులో ఎవరైనా ఆటగాడు గాయపడితే వారి స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని భారత్-ఎ జట్టు కివీస్ పర్యటనలో ఉందనే వాదన సరైంది కాదు. ప్రపంచంలో ఏ జట్టు కూడా ఇలా చేయడం లేదు. తమ దేశవాళీ సీజన్ సమయంలో ఏ జట్టు కూడా విదేశీ పర్యటనలకు ఆటగాళ్లను పంపించదు. ఐపీఎల్ జరిగే సమయంలో 'ఎ' టూర్లు, అండర్-19 సిరీస్లు ఏర్పాటు చేస్తారా?' అని గవాస్కర్ ప్రశ్నించారు.
'భారత క్రికెట్ అంటే పాఠశాల, కళాశాల, జూనియర్ క్రికెట్, కార్పొరేట్ క్రికెట్, ఫస్ట్ క్లాస్ క్రికెట్ను కలిపి భారత క్రికెట్ అంటారు. అన్నిటికి అభిమానులు, మీడియా, స్పాన్సర్లు ఉన్నారు. ప్రస్తుతం భారత జట్టు ఇలా ఉందంటే దానికి ఇవి కూడా ఓ కారణమే' అని గవాస్కర్ పేర్కొన్నారు. ప్రస్తుతం టీమిండియా కివీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. టీమిండియాతో పాటు భారత్-ఎ జట్టు కూడా న్యూజిలాండ్లో పర్యటిస్తోంది.
అనధికారిక మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్-ఏ జట్టుతో జరిగిన ఉత్కంఠ పోరులో భారత-ఏ జట్టు 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. కివీస్ నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 49.4 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఐదు పరుగుల తేడాతో కివీస్ మ్యాచ్ను సొంతం చేసుకుంది. ఈ ఓటమితో మూడు వన్డేల సిరీస్ను 1-2 తేడాతో భారత జట్టు కోల్పోయింది.