హైదరాబాద్: ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు వన్డే స్కోరు అంతర్జాతీయ క్రికెట్లో రికార్డు. అయితే దీనికి ముందు ఆ జట్టు ఆడిన మ్యాచ్లో స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో పరాజయం పాలైన విషయాన్ని క్రికెట్ అభిమానులు అప్పుడే మరిచిపోయి ఉండరు. జూన్ 10న ఈడెన్బర్గ్లో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్పై స్కాట్లాండ్ ఆరు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో వాడిన స్టంప్స్ను వేలం నిర్వహించనున్నారట. మ్యాచ్ అనంతరం ఈ వికెట్లపై విజయం సాధించిన జట్టు సభ్యులు జార్జ్ మున్సే, ప్రెస్టన్ మామ్సెన్ సంతకాలు చేశారు. ఇప్పుడు ఈ స్టంప్స్ను జార్దాన్స్ ఫైట్బాక్ క్యాంపైన్ ద్వారా వేలం వేయనున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బులతో స్కాట్లాండ్లో ఎమ్ఎన్డీ (మెటార్ న్యూరోన్ వ్యాధి) నివారణకు ఉపయోగించనున్నట్లు తెలిపారు.
ఈడెన్బర్గ్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్లో స్కాట్లాండ్ బ్యాట్స్మెన్ చెలరేగారు. 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 371 పరుగులు చేసి ఔరా అనిపించారు. ఇది వన్డేల్లో స్కాట్లాండ్కు అత్యధిక స్కోరు మాత్రమే కాదు.. టెస్టు హోదా లేని జట్టు చేసిన అత్యధిక పరుగులు కూడా కావడం గమనార్హం. స్కాటిష్ ఓపెనర్లు మాథ్యూ క్రాస్ (48), కైల్ కోయెట్జర్ (58) తొలి వికెట్కు 103 పరుగులు జోడించారు.
మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన కాలమ్ మెక్లియాడ్ 94 బంతుల్లోనే 140 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. 16 ఫోర్లు, మూడు సిక్స్లు బాది ఇంగ్లిష్ బౌలర్లతో ఆటాడుకున్నాడు. కాలమ్ మెక్లియాడ్కు ఇది ఏడో సెంచరీ కాగా.. టెస్టు హోదాలేని జట్టు తరఫున ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా తన రికార్డును మరింత మెరుగు పర్చుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్ఘానిస్థాన్ జట్టు జింబాబ్వేపై ఐదు వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. ఇప్పటి వరకూ టెస్టు హోదాలేని క్రికెట్ జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే కాగా.. స్కాట్లాండ్ ఆ రికార్డును బ్రేక్ చేసింది.