
హైదరాబాద్: క్రికెట్లో ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్, ఎగతాళిలు ద్వైపాక్షిక సిరీస్ల్లో భాగమేనని ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ షేన్ వార్న్ అభిప్రాయపడ్డారు. డర్బన్ వేదికగా ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో ఆసీస్ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, సఫారీ వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనపై స్పందించిన షేన్ వార్న్ ఇవన్నీ ఆటలో భాగమేనని బీరు తాగి కలిసిపోవాలని ఇద్దరి ఆటగాళ్లకు సూచించాడు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న క్రమంలో ఇచ్చిన టీ విరామ సమయంలో వీరిద్దరూ డ్రెస్పింగ్ రూమ్కి వెళ్లేటప్పుడు మెట్ల వద్ద తీవ్ర వాగ్వాదానికి దిగారు. సహచర ఆటగాళ్లు వద్దు అని వారిస్తున్నా వార్నర్ దూకుడు ప్రదర్శించాడు.
ఈ సమయంలో వార్నర్ వెంట ఉస్మాన్ ఖవాజా, టిమ్ పైనీలు ఉన్నారు. ఆ తర్వాత కాసేపటికి కెప్టెన్ స్మిత్ వచ్చి వార్నర్ను డ్రస్సింగ్ రూమ్లోకి తీసుకువెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మొత్తం కింగ్స్ మీడ్ స్టేడియంలో మెట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయింది.
ఈ వీడియోను స్థానిక మీడియా బయటపెట్టడంతో ఇప్పుడు చర్చనీయాంశమైంది. తాజాగా ఈ గొడవపై షేన్ వార్న్ ట్విటర్ వేదికగా స్పందించాడు. 'ఆటగాళ్ల మధ్య ఎగతాళిలు, చీదరింపులు, స్లెడ్జింగ్లు ద్వైపాక్షిక సిరీస్ల్లో భాగమే. ఇరు జట్లు ఆటగాళ్లు ఇంతటితో వదిలేయండి. ఒకరికొకరు మర్యాదగా నడుచుకోవడం మంచిది. ఎవరైనా వ్యక్తిగత విషయాలు ప్రస్తావించొద్దు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయడం మానేసి బీరు తాగుతూ కలిసిపోండి' అని వార్న్ ట్వీట్ చేశాడు.
దక్షిణాఫ్రికా ఆటగాళ్ల పట్ల వార్నర్ ఎన్నోసార్లు తన హద్దులు దాటి ప్రవర్తించాడని, అందుకే అతని రియాక్షన్ పట్ల మేం ఆశ్చర్య పడలేదని, ఒకరిపై కామెంట్ చేసేముందు తీసుకోవడానికి కూడా సిద్దంగా ఉండాలని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఆటగాళ్లు వ్యక్తిగతంగా దూషించుకోవడం అంత మంచిది కాదని ఆసీస్ మాజీ క్రికెటర్ గిల్క్రిస్ట్ సైతం ట్వీట్ చేశాడు.