హైదరాబాద్: ఇతర విషయాల గురించి మాట్లాడడం ఆపి ఆటపై దృష్టి సారించాలని ప్రస్తుత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు మాజీ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ సూచించాడు. సఫారీ గడ్డపై బాల్ టాంపరింగ్ ఉదంతం జరిగిన సమయంలో దక్షిణాఫ్రికాలోనే షేన్ వార్న్ కామెంటేటర్గా ఉన్నాడు.
ఒక్కసారిగా ఆసీస్ జట్టుకు పరిస్థితులు వ్యతిరేకంగా మారడంతో ప్రత్యర్థి జట్టు గురించి ఆస్ట్రేలియా శిబిరంలో చాలా గుసగుసలు వినిపించాయని, దానిని తాను గమనించినట్లు వార్న్ వివరించాడు. 'జట్టు సంస్కృతిలో తేడా ఉందో ఏమో చెప్పలేను కానీ ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా జట్టు ప్రత్యర్థి గురించి ఎదో ఒకటి అంటూనే కనిపిస్తోంది' అని వార్న్ తెలిపాడు.
గతంలో జట్టులో ఇలాంటి చూడలేదని అని వార్న్ తెలిపాడు. 'అది ఆస్ట్రేలియా జట్టు సంస్కృతి కాదు. అంతకముందు ఏ ఆస్ట్రేలియా జట్టు కూడా ఇలా ప్రవర్తించలేదు' అని అన్నాడు. చాలా మంది చెబుతున్నారు కానీ న్యూజిలాండ్ తరహా ఆటతీరును అలవరుచుకోవాల్సిన అవసరం ఆస్ట్రేలియాకు లేదని వార్న్ అన్నాడు.
'ఆట ఎలా ఆడాలి? దేని మీద నిలబడాలి? ఏ విధమైన ఆటతీరు కలిగి ఉండాలి? లాంటి అంశాలను ఇసుకలో రాయడానికి ప్రతి ఒక్కరికీ ఇప్పుడు గొప్ప అవకాశం లభించింది. అయితే కివీస్ మాదిరి ఆడాల్సిన అవసరం లేదు. విజయం కోసం తీవ్రంగా పోరాడాలి. అందులో నిజాయతీ కూడా ఉండాలి. మంచి క్రీడాస్ఫూర్తిని కనబరచాలి' అని వార్న్ అన్నాడు.
కేప్టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరూన్ బాన్ క్రాప్ట్లు బాల్ టాంపరింగ్కు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ బాల్ టాంపరింగ్కు పాల్పడినందుకు గాను స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లపై ఏడాది పాటు నిషేధం విధించగా... బాన్ క్రాప్ట్పై 9 నెలలు పాటు క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది.