కొలంబో: మ్యాచ్ ఫిక్సింగ్ నేపథ్యంలో ముగ్గురు శ్రీలంక ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విచారణ ఎదుర్కొంటున్నారని ఆ దేశ క్రీడాశాఖా మంత్రి డుల్లాస్ అలహపెరుమ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. అయితే ఆ ముగ్గురు ఎవరనేది మాత్రం ఆయన చెప్పలేదు. క్రీడల్లో క్రమశిక్షణ, వ్యక్తిత్వం దిగజారిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
వైరల్ న్యూస్.. టీ20 ప్రపంచకప్ న్యూజిలాండ్లో జరగొచ్చు!!
ఈ విషయంపై స్పందించిన శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) ఐసీసీ అవినీతి నిరోధక అధికారుల విచారణలో ప్రస్తుత లంక క్రికెటర్లు ఎవరూ లేరని ఓ ప్రకటనలో వివరణ ఇచ్చింది. 'లంక క్రీడాశాఖా మంత్రి పేర్కొన్న విధంగా ఐసీసీ విచారణ ఎదుర్కొంటున్నది శ్రీలంక మాజీ ఆటగాళ్లని మేం కచ్చితంగా నమ్ముతున్నాం. ప్రస్తుత ఆటగాళ్లు అయితే కాదు' అని ఎస్ఎల్సీ పేర్కొంది.
లంక క్రీడాశాఖా మంత్రి మాట్లాడుతూ ఇటీవల డ్రగ్స్ కేసులో చిక్కుకున్న ఫాస్ట్బౌలర్ షెహన్ మదుశంకపై స్పందించారు. అతడిపై దేశం భారీ అంచనాలు పెట్టుకుందని, కానీ అతడు నిరాశపర్చాడని మంత్రి పేర్కొన్నారు. 'హెరాయిన్' కలిగి ఉన్నాడనే ఆరోపణలతో మదుశంకను శ్రీలంక పోలీసులు గతవారం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆపై శ్రీలంక బోర్డు అతడి కాంట్రాక్టును నిలిపివేసింది. దిగజారిపోతున్న క్రికెట్ విలువల్ని పాఠశాల స్థాయిలోనే మెరుగుపర్చేందుకు ప్రభుత్వం త్వరలోనే దృష్టిసారిస్తుందని అలహపెరుమ అన్నారు.
పాఠశాలల నుంచి నాణ్యమైన ఆటగాళ్లు రావడం లేదనే విషయం తమ దృష్టికి వచ్చిందని అలహపెరుమ తెలిపారు. ఇక ఇటీవల లంక ప్రధాని మహింద రాజపక్సతో జరిగిన ఓ సమావేశంలో ఆ దేశ దిగ్గజ ఆటగాళ్లు కుమార సంగక్కర, మహేళ జయవర్ధనే, సనత్ జయసూర్య పాల్గొని క్షేత్రస్థాయిలో క్రికెట్ను మెరుగు పర్చాలని కోరారు. ప్రస్తుతం శ్రీలంక క్రికెట్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో ఆటగాళ్లు ఫిక్సింగ్ ఆరోపణలకు బలవుతున్నారు. దీంతో శ్రీలంక క్రికెట్ మరింత సంక్షోభం దిశగా పయనిస్తోంది.