సమానంగా జీతాలు అడగటం సరికాదు:
ఇటీవల ఐసీసీ ప్రకటించిన పురస్కారాల్లో స్మృతీ మంధాన 'విమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్'గా ఎంపికైంది. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంధానను.. జీతాల విషయంలో ఓ విలేకరి ప్రశ్నించాడు. 'మాకు వచ్చే జీతాలు పురుషుల క్రికెట్ నుంచి వచ్చే ఆదాయం నుండే వస్తున్నాయని మనం గుర్తించాలి. మహిళల క్రికెట్ ద్వారా ఆదాయం వచ్చిన రోజు నేనే ముందుండి సమాన జీతాల కోసం తప్పకుండా పోరాడుతా. పురుషులతో పోల్చుకుంటే తక్కువ ఫీజులు, పారితోషికాలు పొందడంపై ఎలాంటి బాధలేదు' అని మంధాన పేర్కొంది.
వ్యత్యాసం గురించి ఎవరూ ఆలోచించరు:
'జీతాల వ్యత్యాసం గురించి మహిళల జట్టులో ఎవరూ ఆలోచించరని నేను అనుకుంటున్నా. అందరూ టీమిండియా విజయాలపై దృష్టి పెట్టారు. మేం బాగా ఆడుతున్నాం. మా మ్యాచ్లు చూసేందుకు ప్రేక్షకులు మైదానాలకు వస్తే.. ఆదాయం అదే పెరుగుతుంది. అయితే దాని కోసం మేం మరింత కష్టపడాల్సి ఉంది. ఆ రోజు వచ్చినప్పుడు అన్నీ సర్దుకుంటాయి. అప్పుడు మేమే అడుగుతాం' అని మంధాన చెప్పింది. పురుష క్రికెటర్లకు బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు గరిష్టంగా (ఏ ప్లస్ విభాగం) రూ. 7 కోట్లు ఉంటే.. మహిళలకు గరిష్టంగా రూ. 50 లక్షలు మాత్రమే ఉంది.
ప్రపంచకప్ కోసం ఎదురుచూస్తున్నా:
'టీ20 మహిళల ప్రపంచకప్ కంటే ముందు మేం ముక్కోణపు సిరీస్ ఆడాల్సి ఉంది. ప్రస్తుతం ఆ టోర్నీనే మాకు ముఖ్యం. ఆ తర్వాత వరల్డ్కప్కు జట్టు కూర్పు చేయాల్సి ఉంటుంది. జట్టులో చాలా మందికి ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం ఉంది. అది జట్టుకు మరింత బలం చేకూరుస్తుందని నా నమ్మకం. జట్టు మంచి సమతూకంతో ఉంది. అన్ని విభాగాల్లో మంచి ప్లేయర్లు ఉన్నారు. ప్రపంచకప్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని మంధాన పేర్కొంది.