నాకు అవార్డు రావడం పట్ల నాకంటే నా తల్లిదండ్రులే ఎక్కువ సంతోషంగా ఉన్నారు అని ఐపీఎల్-12లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున ఆడిన శుభ్మన్ గిల్ తెలిపారు. శుభ్మన్ మంచి ఇన్నింగ్స్ లు చాలానే ఆడినా.. మొహాలి వేదికగా పంజాబ్తో జరిగిన మ్యాచ్ మాత్రం ప్రత్యేకం. ఆ మ్యాచ్లో కీలక సమయంలో అర్ధ సెంచరీ (65 నాటౌట్; 49 బంతుల్లో 5×4, 2×6) చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. శుభ్మన్ ఐపీఎల్-12లో 14 మ్యాచులు ఆడి 296 పరుగులు చేశాడు. దీంతో 'ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును దక్కించుకున్నాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
తాజాగా ఓ ఇంటర్వ్యూలో శుభ్మన్ గిల్ మాట్లాడుతూ... 'మా నాన్న నా కోసం చాలా కష్టపడ్డారు, ఎంతో ప్రోత్సహించారు. నేను మ్యాచ్ ఆడేటప్పుడు నాన్న చూస్తే చాలనుకున్నా. కానీ మ్యాచ్ పూర్తయిన అనంతరం మైదానంలో ఆయన ఎంజాయ్ చేసిన విధానం నాకు గర్వంగా అనిపించింది. ఏ తండ్రయినా ఇంతకంటే కోరుకునేది ఏముంటుంది?. నాకు అవార్డు రావడం పట్ల నాకంటే నా తల్లిదండ్రులే ఎక్కువ సంతోషంగా ఉన్నారు' అని శుభ్మన్ తెలిపాడు.
'ఈ ఐపీఎల్లో నేనెంతో నేర్చుకున్నాను. నాలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇక్కడితో సంతృప్తి చెందాలనుకోవడం లేదు. నేనింకా బాగా ఆడాల్సింది. కోల్కతా జట్టుకు ప్లేఆఫ్స్కు చేరే సామర్థ్యం ఉన్నా.. కీలక మ్యాచులో ఓడిపోయాం. ఆ ఓటమి ఎంతో బాధించింది' అని శుభ్మన్ చెప్పారు.
పంజాబ్ మ్యాచ్ అనంతరం శుభ్మన్ గిల్ మాట్లాడుతూ... 'సొంత మైదానంలో విజయం ఓ గొప్ప అనుభూతి. మా అమ్మానాన్న చాలా సంతోషించారు. నేను ఆడుతున్నప్పుడు మా అమ్మానాన్న మైదానంలోనే ఉన్నారు. వాళ్లతో పాటు మా గ్రామం నుంచి చాలా మంది మ్యాచ్ చూసేందుకు వచ్చారు. నేను అర్ధ శతకం పూర్తి చేయగానే మా నాన్న డ్యాన్స్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇది నాకు గొప్ప అనుభూతి' అని గిల్ తెలిపారు.