ఇబ్బందిగా అనిపించింది
విజయ్ శంకర్ తాజాగా స్టార్స్పోర్ట్స్ కార్యక్రమంలో ఎస్ బద్రీనాథ్, అభినవ్ ముకుంద్తో మాట్లాడుతూ నిదహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ విషయాలను గుర్తుచేసుకున్నాడు. 'కెరీర్ ఆరంభంలోనే బద్రీ, బాలాజీ నుంచి రెండు పెద్ద పాఠాలు నేర్చుకున్నా. బద్రీ ఏమన్నాడంటే..."నీలో ప్రతిభ ఉంటే అత్యున్నత స్థాయిలో నువ్వు ఆడడం ఎవరూ ఆపలేరు" అని చెప్పాడు. "జీవితమంటే ఇబ్బందులను ఎదుర్కోవడమే' అని బాలాజీ చెప్పాడు. నిదహాస్ ట్రోఫీ తర్వాత నేను చాలా విమర్శలు ఎదుర్కొన్నా. ఎంతో ఇబ్బంది అనిపించింది. ఆ సమయంలో వాళ్లిద్దరు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అవే వాటి నుంచి బయటపడేలా చేశాయి' అని విజయ్ తెలిపాడు.
19 బంతుల్లో 17
2018లో నిదహాస్ ట్రోఫీ పేరుతో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య ముక్కోణపు టీ20 సిరీస్ జరిగింది. కొలంబోలో జరిగిన ఫైనల్లో భారత్-బంగ్లా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో విజయ్ శంకర్ (17; 19 బంతుల్లో 3x4) బ్యాటింగ్ చేసిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. అతడి బ్యాటింగ్ విధానంతో భారత్ దాదాపు మ్యాచ్ను కోల్పోయేలా కనిపించింది. అయితే దినేశ్ కార్తిక్ (29; 8 బంతుల్లో 2x4, 3x6) అద్భుత బ్యాటింగ్తో మ్యాచ్ను గెలిపించాడు. చివరి బంతికి సిక్స్ కొట్టి అనూహ్య విజయాన్ని అందించాడు.
ఒక్క పరుగు కూడా చేయలేదు
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ సునాయాసంగా గెలుస్తుందని అనిపించినా.. చివరి ఓవర్లలో బంగ్లా బౌలర్లు కట్టుదిట్టమైన బంతులేశారు. 18వ ఓవర్లో విజయ్ ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. దీంతో అతడి బ్యాటింగ్ విధానంపై అభిమానులు మండిపడ్డారు. దినేశ్ కార్తిక్ సిక్స్ కొట్టాడు కాబట్టి మనోడు బతికిపోయాడు కానీ.. లేదంటే విషయం మరోలా ఉండేది.
ప్రపంచకప్ జట్టులో అనూహ్యంగా అవకాశం
2019 వన్డే ప్రపంచకప్ జట్టులో అనూహ్యంగా అవకాశాన్ని దక్కించుకున్న విజయ్ శంకర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. గాయంతో మెగాటోర్నీ మధ్యలోనే వెనుదిరిగాడు. గతేడాది చివరి నుంచి దేశవాళీ క్రికెట్లో తమిళనాడు తరఫున రెగ్యులర్గా మ్యాచ్లాడిన విజయ్ శంకర్.. తన ఆటని మెరుగుపర్చుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2020 సీజన్లో ఫామ్ నిరూపించుకుని మళ్లీ సెలక్టర్ల దృష్టిలో పడాలని ఆశించాడు. అయితే.. కరోనా వైరస్ కారణంగా ఈ టోర్నీని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేయడంతో అతని ఆశలు అడియాశలయ్యాయి