ముగ్గురూ విఫలం:
తొలి టెస్టులో ఓపెనర్ల రేసులో ఉన్న మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, శుభ్మన్ గిల్ ముగ్గురూ విఫలమయ్యారు. న్యూజిలాండ్ ఎలెవెన్తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన పృథ్వీ షా డకౌట్ కాగా.. మయాంక్ అగర్వాల్ ఒక్క పరుగుకే పరిమితమయ్యాడు. ఇక నాలుగో స్థానంలో వచ్చిన శుభ్మన్ గిల్ ఖాతా తెరవకముందే పెవిలియన్ బాట పట్టాడు. పృథ్వీ భారత జట్టు ఖాతా తెరవకముందే పెవిలియన్ చేరగా.. మయాంక్, గిల్ జట్టు స్కోరు 5 పరుగుల వద్ద ఔట్ అయ్యారు. దీంతో భారత్ 5 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆదుకున్న విహారి, పుజారా:
నయా వాల్ ఛతేశ్వర పుజారా, అజింక్య రహానె (18) అండతో ఇన్నింగ్స్ను కాపేపు నడిపించాడు. రహానె కూడా తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో ప్రాక్టీస్ మ్యాచ్లో భారత్ 38 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం తాను క్రీజులోకి రాకుండా కుర్రాళ్లను పరీక్షిస్తున్నాడు. పుజారాకు హనుమ విహారి జత కలవడంతో భారత ఇన్నింగ్స్ గాడిలో పడింది. ఇద్దరూ కివీస్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ హాఫ్ సెంచరీలు చేసారు. దీంతో భారత్ కోలుకుంది. ప్రస్తుతం భారత్ 65 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పుజారా (86), విహారి (71) క్రీజులో ఉన్నారు.
మయాంక్ విఫలం:
టెస్టులలో స్వదేశంలో ఓపెనర్లుగా రోహిత్ శర్మ , మయాంక్ అగర్వాల్ మంచి ఆరంభాలు ఇచ్చి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు గాయంతో రోహిత్ సిరీస్కు దూరం కావడంతో.. మయాంక్కు జతగా మరో ఆటగాడిని ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఇటీవల మయాంక్ ఏమంత ఫామ్లో లేడు. 'భారత్ ఎ' జట్టు తరఫున అనధికారిక టెస్టు రెండు ఇన్నింగ్స్లోనూ డకౌటయ్యాడు. ఇక మూడు వన్డేల సిరీస్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. సన్నాహక మ్యాచ్లోనూ ఖాతా తెరవలేదు.
ఓపెనర్లుగా ఎవరు?:
మరోవైపు పృథ్వీ షా వన్డే సిరీస్లో ఫర్వాలేదనిపించినా.. భారీ స్కోరు సాధించేలేకపోయాడు. దూకుడుగా ఆడుతూ వికెట్ పారేసుకున్నాడు. ఓ రనౌట్ అయ్యాడు. మరోవైపు 'భారత్-ఎ' మ్యాచ్లలో గిల్ అద్భుతంగా రాణించాడు. అనధికారిక తొలి టెస్టులో 83, 204*.. రెండో టెస్టులో 136 స్కోర్లు చేసాడు కానీ.. తాజా ప్రాక్టీస్ మ్యాచ్లో విఫలమయ్యాడు. ముగ్గురి ఫామ్ ఇప్పుడు టీమిండియాను కలవరపెడుతోంది. దీంతో ఫిబ్రవరి 21 నుంచి కివీస్తో జరగనున్న తొలి టెస్టులో ముగ్గురిలో ఎవరికి ఓపెనర్లుగా అవకాశం దక్కుతుందా చూడాలి.