నా విషయంలో తప్పు జరిగిపోయింది:
పృథ్వీ షా తాజాగా 'టైమ్స్ ఆఫ్ ఇండియా'తో మాట్లాడుతూ... 'మేము తినే ప్రతి దాని గురించి జాగ్రత్తగా ఉండాలి. పారాసిట్రమాల్ వంటి చిన్న టాబ్లెట్ విషయంలో కూడా. యువ క్రికెటర్లందరికి మందులపై అవగాహన ఉండాలి. ఒక చిన్న టాబ్లెట్ తీసుకుకునే ముందు డాక్టర్ లేదా బీసీసీఐ వైద్యుల ఆమోదం పొందాలి. నిషేధిత పదార్థాల గురించి వైద్యులను అడగడం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. నా విషయంలో తప్పు జరిగిపోయింది. దగ్గు సిరప్ నిషేధించబడిన పదార్థం అని నాకు తెలియదు. నేను దీని నుండి ఒక పాఠం నేర్చుకున్నా. మరోసారి పునరావృతం కనివ్వను' అని పృథ్వీ షా అన్నాడు.
ఆ రెండు ఎప్పటికీ మరచిపోలేనివి:
'నా క్రికెట్ కెరీర్లో అండర్-19 ప్రపంచకప్ గెలవడం ఒక మరచిపోలేని జ్ఞాపకమైతే, అరంగేట్రం టెస్టు మ్యాచ్లో సెంచరీ చేయడం మరొక జ్ఞాపకం. ఈ రెండు ఎప్పటికీ మరచిపోలేనివి. డోపింగ్ కంట్రోల్ అనేది నా చేతుల్లోనే ఉంటుంది. గాయాలు అనేవి మన చేతుల్లో ఉండవు. విమర్శలు అనేవి జీవితంలో ఒక భాగమే. విమర్శలు చేసేటప్పుడు అది మంచి విమర్శగా ఉండాలి. అది మనకు ఉపయోగపడాలి. నిజంగా 2019 సంవత్సరం నాకు చేదు జ్ఞాపకాల్ని మిగిల్చిపోయింది. సమయం వచ్చినప్పుడు బ్యాట్తోనే విమర్శలకు సమాధానం చెబుతా' అని పృథ్వీ షా తెలిపాడు.
నరకం చూశా:
'ఫిబ్రవరిలో జరిగిన ముష్తాక్ అలీ టోర్నీలో ముంబై తరఫున ఆడిన నేను తీవ్ర జలుబు, దగ్గుతో బాధపడ్డాను. దీంతో తక్షణ ఉపశమనం కోసం దగ్గుమందు వాడాను. ఆసీస్ టూర్లో అయిన కాలి గాయం నుంచి త్వరగా కోలుకోవాలనే ఆతృతలో కనీస జాగ్రత్తలు పాటించకుండా దగ్గు సిరప్ విషయంలో ప్రోటోకాల్ పాటించలేదు. కనీసం బీసీసీఐ డాక్టర్ను కానీ, వేరే డాక్టర్ను కానీ సంప్రదించాల్సి ఉండాల్సింది. తొందర్లో చిన్న మెడిసినే కదా అని ఆ సిరప్ వాడాను. దాంతో ఇబ్బందుల్లో పడ్డాను. తెలియక చేసిన తప్పుకు నరకం అనుభవించా. ఇలా ఎవరికీ జరగకూడదు' అని పృథ్వీ షా కోరుకున్నాడు.
కొత్త రికార్డు:
గత ఫిబ్రవరిలో క్రైస్ట్ చర్చ్ వేదికగా కివీస్-భారత్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో పృథ్వీ షా అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 64 బంతులను ఎదుర్కొన్న షా.. 8 ఫోర్లు ఒక సిక్స్ సాయంతో 54 పరుగులు చేసాడు. ఈ ఇన్నింగ్స్లో షా ఓ రికార్డు క్రియేట్ చేశాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత న్యూజిలాండ్లో జరిగిన టెస్టు మ్యాచ్లో అర్థశతకం పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.