హర్ప్రీత్ మాయ:
భారీ లక్ష్య ఛేదనలో బెంగళూరుకు ఆదిలోనే షాక్ తగిలింది. సూపర్ ఫామ్లో ఉన్న దేవదత్ పడిక్కల్ (7) రిలే మెరిడిత్ వేసిన మూడో ఓవర్లో ఔటయ్యాడు. ఈ సమయంలో విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ నిలకడగా బ్యాటింగ్ చేశారు. భారీ షాట్లకు పోకుండా సింగిల్స్ మాత్రమే తీశారు. పవర్ప్లే ఆఖరికి బెంగళూరు వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. కోహ్లీ, పటిదార్ సింగిల్స్కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో చేయాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. 11వ ఓవర్లో హర్ప్రీత్ మాయ చేశాడు. వరుస ఓవర్లలో కోహ్లీ, గ్లెన్ మాక్స్వెల్ (0), ఏబీ డివిలియర్స్ (3)ను ఔట్ చేసి ఆర్సీబీని కోలుకోలేని దెబ్బతీశాడు.
హర్షల్ చెలరేగినా:
15వ ఓవర్లో రజత్ పాటిదార్.. క్రిస్ జోర్డాన్ బౌలింగ్లో ఔట్ అవ్వడంతో బెంగళూరు ఓటమి ఖాయం అయింది. ఇక 16 ఓవర్లో రవి బిష్ణోయ్ కూడా షాబాజ్ అహ్మద్ (8), డేనియల్ సామ్స్ (3)ను ఔట్ చేయడంతో కోహ్లీసేన ఓటమి అంచున నిలిచింది. ఇన్నింగ్స్ చివర్లో కైల్ జేమీసన్ (16 నాటౌట్)తో కలిసి హర్షల్ పటేల్ ధాటిగా ఆడాడు. అయితే అప్పటికే పంజాబ్ విజయం ఖాయమైంది. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ మూడు, బిష్ణోయ్ రెండు వికెట్లు పడగొట్టారు.
గేల్ జిగేల్:
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 రన్స్ చేసింది. పంజాబ్కు ఆరంభంలోనే దెబ్బ తగిలింది. ప్రభ్సిమ్రన్ సింగ్ (7) త్వరగానే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన క్రిస్ గేల్ (46; 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు) బౌండరీల వర్షం కురిపిస్తూ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. కైల్ జేమీసన్ వేసిన ఆరో ఓవర్లో 5 ఫోర్లు బాది 20 పరుగులు రాబట్టాడు. మరోవైపు కేఎల్ రాహుల్ (91; 57 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సులు) కూడా ధాటిగానే ఆడడంతో పవర్ప్లే ఆఖరికి పంజాబ్ వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. తర్వాతి ఓవర్లలోనూ వీలుచిక్కినప్పుడల్లా ఇద్దరూ బౌండరీలు బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అయితే 11వ ఓవర్ వేసిన డేనియల్ సామ్స్ బౌలింగ్లో డివిలియర్స్కు క్యాచ్ ఇచ్చి గేల్ వెనుదిరిగాడు.
రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్:
12వ ఓవర్ వేసిన కైల్ జేమిసన్ బౌలింగ్లో హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్ మరోసారి డకౌట్ అయ్యాడు. పూరన్ ఈ సీజన్లో నాలుగో డకౌట్ కావడం విశేషం. ఆపై కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ చేశాడు. ఇక 14వ ఓవర్లో షాబాజ్ అహ్మద్ బౌలింగ్లో 5 పరుగులు చేసిన దీపక్ హుడా పాటిధార్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లో చహల్ బౌలింగ్లో షారుఖ్ ఖాన్ డకౌట్గా వెనుదిరిగాడు. ఈ సమయంలో రాహుల్ ఒంటరి పోరాటం చేశాడు. ధాటిగా పరుగులు చేస్తూ పంజాబ్ స్కోరును పరుగులు పెట్టించాడు. ఇక చివరి ఓవర్లో హర్షల్కు చుక్కలు చూపించాడు. 2 ఫోర్లు, ఓ సిక్స్తో చెలరేగాడు. హర్ప్రీత్ బార్ చివరి బంతిని స్టాండ్స్లోకి బాది పంజాబ్ ఇన్నింగ్స్కు మంచి ఎండింగ్ ఇచ్చాడు. బెంగళూరు బౌలర్లలో జేమీసన్ రెండు వికెట్లు తీయగా.. సామ్స్, చహల్, అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.