
హైదరాబాద్: దుబాయి వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ స్పిన్నర్ యాసిర్ షా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో 12.3 ఓవర్లలో 41 పరుగులిచ్చి 8 వికెట్లు తీశాడు. యాసిర్ షా కెరీర్లో ఇదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కావడం విశేషం.
ఒకానొక దశలో 50/0తో నిలిచిన న్యూజిలాండ్ యాసిర్ షా దెబ్బకు 90 పరుగులకే కుప్పకూలింది. ముఖ్యంగా యాసిర్ షా స్పిన్ మ్యాజిక్కు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. కివీస్ బ్యాట్స్మెన్లలో ఆరుగురు బ్యాట్స్మెన్ డకౌట్గా వెనుదిరిగారు.
జీత్ రావల్(31) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కివీస్ బ్యాట్స్మెన్లలో లాథమ్(22), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (28) పరుగులు చేశారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్మెన్ వరుసగా పెవిలియన్కు చేరారు. కోలిన్ డి గ్రాండ్హోమ్ (0)ను హసన్ అలీ ఔట్ చేయగా, వాట్లింగ్ను హసన్ అలీ రనౌట్ చేశాడు.
ఇన్నింగ్స్ 28వ ఓవర్లో యాసిర్ షా ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు తీయడం విశేషం. దీంతో దీంతో తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 35.3 ఓవర్లలోనే 90 పరుగులకే ఆలౌటైంది. దీంతో దుబాయిలో అతి తక్కువ పరుగులు చేసిన జట్టుగా న్యూజిలాండ్ చెత్త రికార్డును మూటగట్టుకుంది.
ఓపెనర్లు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక, టెస్టుల్లో ఓ జట్టు చేసిన అత్యల్ప స్కోరు కూడా ఇదే కావడం గమనార్హం. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ బ్యాట్స్మెన్లలో బాబర్ అజాం (127) సెంచరీ, హరీష్ సోహైల్ (148) సెంచరీలతో రాణించడంతో తన తొలి ఇన్నింగ్స్ను 418 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది.