హైదరాబాద్: అత్యంత విశేషాదరణ పొందిన ఐపీఎల్.. ఒక్కటే తమ కంటే ముందుంది అంటున్నాడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా. రెవెన్యూ పరంగా, యువ ఆటగాళ్లకు మంచి ప్రోత్సాహం అందించే విధంగా ఐపీఎల్ తోడ్పడుతోంది. ఇదే తరహాలో ప్రారంభించిన సౌతాఫ్రికా లీగ్ ఆరంభంలోనే చతికిలబడింది.
వీటి బాటలోనే దాయాది దేశం పాకిస్థాన్ కూడా నడుస్తోంది. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) పేరుతో దుబాయ్ వేదికల్లో టీ20 లీగ్ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రెండేళ్ల క్రితం మొదలెట్టింది. ప్రస్తుతం పీఎస్ఎల్ మూడో సీజన్ జరుగుతోంది. ఫిబ్రవరి 22 నుంచి జరుగుతోన్న ఈ లీగ్ సంబంధించి పాక్ మాజీ కెప్టెన్ రమీజ్ రజా మాట్లాడారు.
పీఎస్ఎల్ అన్ని కోణాల్లో విజయవంతమైంది. ప్రతి ఏడాది ఆటగాళ్ల నైపుణ్యం మెరుగవడంతో పాటు.. ఆదాయం కూడా వచ్చి చేరుతోంది. పీఎస్ఎల్-3లో అరంగేట్రం చేస్తున్న క్రిస్లిన్, కోలిన్ ఇన్గ్రామ్, జోఫ్రా ఆర్చర్లపైనే అందరి దృష్టి ఉంది. ఒక్కొక్క మ్యాచ్ నిష్పత్తి పరంగా చూసినట్లెతే ఐపీఎల్ తరువాత రెండో స్థానంలో పీఎస్ఎల్ ఉంటుంది. ప్రతిఏడాది లీగ్లోకి కొత్త ఆటగాళ్లు వస్తున్నారని రజా అన్నారు.
బీసీసీఐ ఆధ్వర్యంలో రెండు నెలల పాటు ఐపీఎల్ రెవెన్యూ పరంగా, అభిమానుల ఆదరణలోనూ, బ్రాండ్ విలువలోనూ ఏ మాత్రం తక్కువ కాకుండా దూసుకుపోతోంది. అత్యంత విజయవంతమైన ఈ టోర్నీని ఆదర్శంగా తీసుకొని ఆస్ట్రేలియా బోర్డు బిగ్బాష్ లీగ్(బీబీఎల్)ను నిర్వహిస్తోంది. బంగ్లాదేశ్, వెస్టిండీస్ కూడా ఆయా దేశాల్లో ప్రత్యేక లీగ్లను ఆరంభించాయి.