5 మిలియన్లు విరాళం:
కరోనా బాధితులను ఆదుకునేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆ దేశ ప్రభుత్వానికి రూ. 5 మిలియన్లు విరాళంగా ఇచ్చింది. జాతీయ అత్యవసర నిధికి ఈ మొత్తాన్ని అందజేయనున్నట్టు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ ఎసాన్ మణి ప్రకటించారు. కరోనాపై పోరాటానికి సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్లు రూ. 5 మిలియన్లు విరాళం ఇచ్చారని ఆయన తెలిపారు. బోర్డులోని కిందిస్థాయి నుంచి సీనియర్ మేనేజర్ వరకు ఉన్న ఉద్యోగులు అంతా తమ ఒక్క రోజు జీతాన్ని జాతీయ అత్యవసర నిధికి అందజేయనున్నట్టు మణి వెల్లడించారు. ఇక జనరల్ మేనేజర్ ఆపై స్థాయి అధికారులు రెండు రోజుల వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్టు చెప్పారు.
ప్రభుత్వానికి అండగా ఉండాలి:
పీసీబీ ఎప్పుడూ కష్ట సమయాల్లో ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్న విషయాన్ని పీసీబీ చైర్మన్ మణి గుర్తుచేశారు. కరోనా వైరస్ క్రికెట్కు అంతరాయం కలిగించవచ్చు కానీ.. దేశం మొత్తం ప్రభుత్వానికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం అవసరమైన అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. ప్రజలు అందరు కూడా కరోనాపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పాకిస్తాన్లో కూడా పంజా విసురుతున్న విషయం తెలిసిందే. పాక్లో ఇప్పటివరకు 1,000కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
బంగ్లా క్రికెటర్ల సగం రోజు వేతనం:
కరోనాపై పోరాటంలో ఆర్థికపరంగా తమ వంతు చేయూతనందించేందుకు వివిధ దేశాల క్రికెటర్లు ముందుకొస్తున్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ సీనియర్ క్రికెట్ జట్టుకు చెందిన 27 మంది క్రికెటర్లు తమ సగం రోజు వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తం సుమారు 25 లక్షల టాకాలు. అంటే సుమారు రూ. 23 లక్షలకు సమానం.
లంక బోర్డు కూడా:
శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా తమ తరఫు నుంచి 2 కోట్ల 50 లక్షల శ్రీలంక రూపాయలు (సుమారు 1 కోటి 2 లక్షలు) ఇస్తున్నట్లు ప్రకటించింది. కరోనా సంబంధించి చికిత్సలో కీలకమైన వీడియో లారింగోస్కోప్ తదితర వైద్య పరికరాలు కొనుగోలు చేసేందుకు కావాల్సిన మొత్తాన్ని అందజేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. అందరూ ఇస్తున్నా.. మన టీమిండియా ఆటగాళ్లు మాత్రం ఇప్పటి వరకు ఎవరూ విరాళాలు ప్రకటించలేదు.