5 స్టార్ కాదు.. 3 స్టార్ హోటల్లోనే:
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రూల్స్ ప్రకారం క్రికెటర్లకి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఆతిథ్య దేశందే. ఆటగాళ్లు బస చేసే హోటల్, వారి ప్రయాణాలు అత్యున్నత స్థాయి, ప్రమాణాలతో ఉండేలా ఆతిథ్య దేశం చూసుకోవాలి. కానీ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పాకిస్తాన్ నుంచి నేరుగా వోర్సెస్టర్ సిటీకి చేరుకున్న పాక్ జట్టు.. వేరే ప్రత్యామ్యాయం లేకపోవడంతో అక్కడ ఓ 3 స్టార్ హోటల్లో బస చేసింది. ఇంగ్లాండ్ పర్యటనకి ఎంపికైన పాక్ క్రికెటర్లతో పాటు సహాయ సిబ్బంది ఇక్కడే ఉన్నారు.
14 రోజుల క్వారంటైన్ పూర్తి:
ఆగస్టు 5 నుంచి ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్ల మధ్య మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ జరగాల్సి ఉంది. విండీస్ పర్యటన మాదిరే ఈ సిరీస్ని కూడా పూర్తి బయో-సెక్యూర్ వాతావరణంలో నిర్వహించాలని ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్ణయించింది. దాంతో సిరీస్కి నెల రోజుల ముందే పాక్ జట్టుని రప్పించి వోర్సెస్టర్ సిటీలోని చిన్న హోటల్లో ఉంచింది. అక్కడే 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉన్న పాక్ క్రికెటర్లని.. కనీసం రూము వెలుపలికి కూడా ఈసీబీ అనుమతించలేదు. ప్రస్తుతం ఆ క్వారంటైన్ గడువు ముగిసింది. సదరు హోటల్లో పాక్ క్రికెటర్లు, సహాయ సిబ్బంది మాత్రమే ఉన్నారు.
జులై 30 వరకూ వోర్సెస్టర్ సిటీలోనే:
ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్ల మధ్య సిరీస్ మొత్తం మాంచెస్టర్, సౌతాంప్టన్ వేదికగానే జరగనున్నాయి. ఇంగ్లండ్లో ఈ రెండు స్టేడియాలే హోటల్తో అనుబంధంగా ఉన్నాయి కాబట్టి మ్యాచులు ఇక్కడే జరగనున్నాయి. అందుకే ప్రస్తుతం వెస్టిండీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ కూడా ఈ రెండు వేదికల్లోనే జరుగుతోంది. జులై 30 వరకూ వోర్సెస్టర్ సిటీలోనే ఉండనున్న పాకిస్థాన్.. ఆ తర్వాత మాంచెస్టర్కి చేరుకోనుంది. అక్కడ ప్రాక్టీస్ మ్యాచులు ఆడి.. ఆ తర్వాత తొలి టెస్ట్ ఆడనున్నారు. మరోవైపు ఇంగ్లీష్ ఆటగాళ్లు ఇప్పటికే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే.
మొదటగా 10 మందికి వైరస్:
గత నెలలో ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపికైన 29 మంది పాక్ క్రికెటర్లకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కరోనా వైరస్ టెస్టులు నిర్వహించగా.. 10 మందికి వైరస్ సోకినట్టు వెల్లడైంది. అనంతరం నిర్వహిచిన టెస్టుల్లో 7 మంది క్రికెటర్లకు నెగిటివ్ రాగా.. ఇంగ్లండ్కు పయనం అయ్యారు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రావడంతో ముగ్గురు పాకిస్థాన్ క్రికెటర్లు హైదర్ అలీ, ఇమ్రాన్ ఖాన్, కషిఫ్ బట్టి కూడా ఇంగ్లండ్కు వెళ్లారు.
టీ20లు అన్నీ సౌతాంప్టన్లోనే:
ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్ల మధ్య మొదటి టెస్టు మాంచెస్టర్లో జరుగుతుంది. రెండో టెస్టు (ఆగస్టు 13-17), మూడో టెస్టు (ఆగస్టు 21-25)కు సౌతాంప్టన్ వేదికగా జరగనున్నాయి. ఆ తర్వాత రెండు జట్లు మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడతాయి. తొలి మ్యాచ్ ఆగస్టు 28న జరుగుతుంది. టీ20లు అన్నీ సౌతాంప్టన్లో జరుగుతాయి.
ధోనీభాయ్ నాకు సమస్య పరిష్కారిగా కనిపిస్తాడు.. నాతో ఎందరినో ఔట్ చేయించాడు: చహల్