హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్లో బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. ఒక్క బంతి వేయడానికి ఏకంగా ఐదుసార్లు ప్రయత్నించిన క్రికెటర్గా పాకిస్థాన్ క్రికెటర్ వాహెబ్ రియాజ్ చరిత్ర సృష్టించాడు. దుయాబ్ వేదికగా శ్రీలంక-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది.
శ్రీలంకతో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో 111వ ఓవర్ నాలుగో బంతిని వేసేందుకు వాహెబ్ రియాజ్ అష్టకష్టాలు పడ్డాడు. ఒక్క బంతిని వేసేందుకు ఐదుసార్లు ప్రయత్నించి చివరికి ఆరోసారి విజయవంతమయ్యాడు.

దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా ఆగిపోయాడు. అలా ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా ఐదుసార్లు.. ఐదు నిమిషాలపాటు ప్రయత్నించినా బంతిని వేయలేకపోయాడు. ఒక్క బంతి విసిరేందుకు ఐదు నిమిషాలకు పైగా తీసుకున్నాడు. క్రీజులో ఉన్న బ్యాట్స్మన్ కరుణరత్నెతోపాటు పాక్ కెప్టెన్ సర్ఫాజ్ అహ్మద్, అంపైర్ కూడా విసుగుచెందారు.
అదే సమయంలో రియాజ్ తీరుపై పాక్ కోచ్ మిక్కీ అర్థర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోతో 'వాహెబ్ పాపం బౌలింగ్ మరిచిపోయాడేమో' అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కొందరు ట్రోల్ చేస్తున్నారు.