
హైదరాబాద్: బంగ్లాదేశ్ను ఇకపై పసికూనగా భావించొద్దని, దక్షిణాఫ్రికా లాంటి మేటి జట్టుని ఓడించామని బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రఫే మోర్తాజా పేర్కొన్నాడు. వరల్డ్కప్ టోర్నీలో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ 21 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్ అనంతరం బంగ్లా కెప్టెన్ మష్రఫే మోర్తాజా మాట్లాడుతూ "ఇది అనుకోకుండా వచ్చిన గెలుపని అకుంటున్నారా? మేం మంచి ప్రదర్శన చేస్తే ఎలా రాణించగలుుగతామో మాకు తెలుసు. బంగ్లా గేమ్పై చాలా మందికి చులకన భావం ఉంది. వాటిని మేం పట్టించుకోం. మా ప్రదర్శనపైనే దృష్టిసారిస్తాం" అని అన్నాడు.
"వరల్డ్కప్కు ముందు కూడా కొన్ని మ్యాచ్లు అద్భుతంగా ఆడాం. ఇదే మా అత్యుత్తమ విజయం కాదు. అత్యుత్తమ విజయాల్లో ఇదొకటని భావిస్తున్నా. ఇంగ్లాండ్లో ప్రతీకూల పరిస్థితుల్లో చాలా బాగా ఆడామనే చెప్పాలి. అయితే, ఎప్పుడూ ఇలానే ఆడతామని చెప్పడం లేదు. అన్ని మ్యాచ్ల్లోనూ ఇలాగే ఆడాలని కోరుకుంటా" అని మోర్తాజా అన్నాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ (80 బంతుల్లో 78), షకీబ్ అల్ హసన్ (84 బంతుల్లో 75; 8 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అనంతరం 331 పరుగుల లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్లకు 309 పరుగులు చేసి ఓడిపోయింది.
ఈ మెగా టోర్నీలో సఫారీలకు వరుసగా ఇది రెండో ఓటమి. ఇంగ్లాండ్తో జరిగిన వరల్డ్కప్ ఆరంభ మ్యాచ్లో 104 పరుగుల తేడాతో ఓడిపోయింది.