ఒక్కమాట కూడా చెప్పలేదు: జట్టు నుంచి తప్పించడంపై విజయ్ ఆవేదన

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ఐదు టెస్టు సిరీస్లో తనని జట్టు నుంచి తప్పించే సమయంలో సెలక్టర్లు ఒక్క మాట చెప్పలేదని మురళీ విజయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. 2014లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో అద్భుత ప్రదర్శన చేసిన మురళీ విజయ్, 2018లో మాత్రం పేలవ ప్రదర్శన చేశాడు.
ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా తొలి మూడు టెస్టుల కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్న మురళీ విజయ్ తొలి రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్ల్లో కలిపి 26 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో మూడో టెస్టు నుంచి అతడిని తప్పించిన మురళీ విజయ్... చివరి రెండు టెస్టుల్లో అతడిని జట్టులో ఎంపిక చేయలేదు.
విండిస్తో రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్కు జట్టును ఎంపిక చేసిన అనంతరం ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ క్రికెటర్లతో మాట్లాడేందుకు తాము అధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపాడు. ఆటగాళ్లకు నిరంతరం అందుబాటులో ఉంటామని, అన్ని విషయాలూ వారితో చెప్తామని అన్నాడు. అయితే, టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ సెలక్టర్లు తననెందుకు జట్టులోంచి తప్పించారో చెప్పలేదని విమర్శించాడు.

జట్టు నుంచి తప్పించడంపై వివరణ రాలేదు
వెస్టిండిస్తో జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ నుంచి మురళీ విజయ్ను సెలక్టర్లు తప్పించారు. ఈ సందర్భంగా మురళీ విజయ్ మాట్లాడుతూ "మూడో టెస్టు నుంచి నన్ను తప్పించే సమయంలో చీఫ్ సెలక్టరే కాదు.. ఎవరూ నాతో కనీసం మాటమాత్రమైనా చెప్పలేదు. అప్పుడే కాదు.. ఇప్పటికీ కూడా ఆ సిరీస్లో వేటు పడటంపై నాకు సరైన వివరణ రాలేదు" అని అన్నాడు.
ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల్లోనూ చోటు దక్కని ట్రిపుల్ సెంచరీ వీరుడు కరుణ్నాయర్ సైతం ఇవే మాటలు చెప్పిన సంగతి తెలిసిందే. విండీస్తో సిరిస్కు జట్టు నుంచి తప్పించడంపై తనతో ఎవరూ మాట్లాడలేదని కరుణ్ నాయర్ చెప్పాడు. ఈ విషయంపై దుమారం రేగింది. దీంతో చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మీడియాలో వివరణ ఇచ్చారు.

మాజీ క్రికెటర్లు సైతం మండిపాటు
ఈ నేపథ్యంలో జట్టు నుంచి ఒక ఆటగాడిని తప్పించే సమయంలో, అతనికి కారణం చెప్తూ కనీస సమాచారం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్న సంగతి తెలిసిందే. వెస్టిండిస్తో రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ కోసం ఎంపికలో భారత సెలక్టర్లు వ్యవహరిస్తున్న తీరుపై వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సైతం మండిపడ్డాడు.

సెలక్టర్ల ఆలోచనా విధానం ఏమిటో అర్థం కావడం లేదు
ముఖ్యంగా ఆసియాకప్లో రాణించిన రోహిత్ శర్మను విండిస్తో టెస్టు సిరిస్కు ఎంపిక చేయకపోవడాన్ని భజ్జీ తప్పుబట్టాడు. ఈ మేరకు భజ్జీ తన ట్విట్టర్లో స్పందించాడు. "వెస్టిండీస్తో జరగబోయే టెస్టు సిరీస్లో భాగంగా భారత జట్టులో రోహిత్ శర్మను పరిగణలోకి తీసుకోలేదు. అసలు సెలక్టర్ల ఆలోచనా విధానం ఏమిటో అర్థం కావడం లేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి.. రోహిత్ను ఎందుకు ఎంపిక చేయలేదు తెలుసుకోవాలని ఉంది. దీనిని నేను జీర్ణించుకోలేకపోతున్నా" అని ట్వీట్ చేశాడు.
టీ విరామానికి భారత్ 232/3
రాజ్కోట్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్ పృథ్వీ షా (134) సెంచరీ చేయడంతో టీ విరామ సమయానికి భారత్ జట్టు 51 ఓవర్లలో 232/3తో మెరుగైన స్థితిలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లి (4), అజింక్య రహానే (0) ఉండగా.. మిడిలార్డర్ బ్యాట్స్మెన్ చతేశ్వర్ పుజారా (86) కొద్దిలో సెంచరీని చేజార్చుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications