15 రోజులు కాశ్మీర్లో:
ప్రపంచకప్ 2019 ధోనీ చివరిది అని అనుకున్నారు. సెమీస్లో న్యూజిలాండ్పై ఆడిన మ్యాచే ధోనీకి చివరిది అని ప్రచారం సాగింది. కానీ.. ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుండి రెండు నెలల విరామం తీసుకుని భారత ఆర్మీలో సేవలందించాడు. విధుల్లో భాగంగా 106 టెరిటోరియల్ ఆర్మీ (పారా బెటాలియన్)లో సేవ చేయడానికి 15 రోజులు కాశ్మీర్లో గడిపాడు. అనంతరం కుటుంబంతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్ళాడు.
బంగ్లాదేశ్ సిరీస్కు దూరం:
క్రికెట్కు తాత్కాలిక విరామం పలికి వెస్టిండీస్, దక్షిణాఫ్రికా సిరీస్కు అందుబాటులో లేని ధోనీ.. సెప్టెంబర్ 24 నుంచి జరగనున్న విజయ్ హజారే ట్రోఫీ, నవంబర్లో స్వదేశంలో ప్రారంభమయ్యే బంగ్లాదేశ్ సిరీస్కు కూడా అందుబాటులో ఉండడని సమాచారం తెలుస్తోంది. అంతేకాదు ధోనీ సెలక్షన్ కమిటీకి నవంబర్ వరకు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. ఈ వార్తతో ధోనీ అభిమానులు నిరాశకు గురయ్యారు. ఏదేమైనా ఐపీఎల్-13లో జట్టు చెన్నైకి ధోనీ సారధ్య భాద్యతలు నిర్వహిస్తాడని స్పష్టం అయింది.
రిటైర్మెంట్పై పుకార్లు:
2016లో టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఆస్ట్రేలియాతో తలపడ్డ మ్యాచ్లో ఓ ఫొటోని తాజాగా విరాట్ కోహ్లీ పోస్ట్ చేశాడు. 'నేను ఎన్నటికీ మరిచిపోలేని మ్యాచ్ ఇది. ప్రత్యేకమైన రోజు. ఫిటెనెస్ పరీక్షలో పరుగెత్తించినట్టు ధోనీ నన్ను పరుగులు పెట్టించాడు' అని ట్వీట్ చేశాడు. దీంతో ధోనీ వీడ్కోలు గురించి పరోక్షంగా కోహ్లీ పోస్ట్ చేశాడని వార్తలు పెద్దఎత్తున వచ్చాయి. అయితే ధోనీ రిటైర్మెంట్పై వస్తున్న వార్తలను ధోనీ సతీమణి సాక్షి కొట్టిపారేయడంతో ఊహాగానాలకు తెరపడింది.
కొత్త కారులో షికారు:
ఇటీవల కొన్న 'రెడ్బీస్ట్' జీప్ చెరోకీ ట్రాక్హక్ ఎస్యూవీని ధోనీ తొలిసారి నడిపాడు. ధోనీ రాంచీలో కారు నడుపుతూ అభిమానుల కంట పడ్డాడు. ధోనీ జీపు నడుపుతున్న ఫొటోలు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమెరికా పర్యటన అనంతరం రాంచీ చేరుకున్న ధోనీని.. విమానాశ్రయంలో రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వారితో కలిసి మహీ కారులో వెళ్లాడని సమాచారం తెలుస్తోంది. ధోనీ పక్కనే ఆయన సతీమణి సాక్షి కూడా ఉంది.