రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సామాజిక మాధ్యమాలకు వీలైనంత దూరంగానే ఉంటాడు. ఎప్పుడో ఒకసారి ఓ వీడియోలోనూ, వేరే వాళ్లు పోస్టు చేసే ఫోటోల్లోనో తళుక్కుమంటాడు. ఇక కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత మార్చి నుంచి రాంచీలోని తన ఫామ్ హౌస్కే పరిమితమైన ధోనీ.. అప్పుడప్పుడు అతని భార్య సాక్షి షేర్ చేస్తున్న వీడియోల్లో కనిపిస్తున్నాడు. ఇటీవల వెలువడిన వార్తల ప్రకారం ధోనీ.. అతని పొలంలో ప్రస్తుతం వ్యవసాయం చేస్తూ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
లాక్డౌన్ కారణంగా పూర్తిగా ఇంటికే అంకితమైన అతను తన కూతురుతో ఆడుకుంటున్న వీడియోలో నెరిసిన గడ్డంతో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ధోనీ తన అవతారాన్ని మార్చేశాడు. గడ్డం కొద్దిగా పెంచి దానికి నల్ల రంగు వేశాడు. బహుశా ఓ వీడియోకాల్లో అతను మాట్లాడుతూ ఉన్న వీడియో బయటకు వచ్చింది. దాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్లో పోస్టు చేయడంతో మహీ కొత్త లుక్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. చాలా రోజుల తర్వాత ధోనీని చూసిన ఫ్యాన్స్ కూడా ఎమోషనల్గా ఫీలవుతున్నారు.
The much needed pawsitivity at 7! #Thala @msdhoni #WhistlePodu 🦁💛 pic.twitter.com/fEVrG0Gubc
— Chennai Super Kings (@ChennaiIPL) July 17, 2020
చెన్నై పోస్ట్ చేసిన వీడియోలో ధోనీ కాస్తంత కొత్తగా కనిపిస్తున్నాడు. ధోనీ వయసు తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ వీడియోలో ఎవరితోనో వీడియో కాల్ మాట్లాడుతూ ధోని వారికి హాయ్ చెబుతున్నాడు. ఈ వీడియోలో ధోనిని చూసిన ఫ్యాన్స్, తిరిగి గ్రౌండ్లోకి దిగేందుకు సిద్ధమైపోయాడని కామెంట్లు పెడుతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ జరిగితే ధోనీని క్రికెట్ మైదానంలో తిరిగి చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక మహీ ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాధన్ మాట్లాడుతూ.. వచ్చే పది సంవత్సరాల పాటు ధోనీనే చైన్నై సూపర్ కింగ్స్ బాస్ అని నా అభిప్రాయం అని పేర్కొన్నారు.
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ టీమిండియాకి దూరమయ్యాడు. బీసీసీఐ సెలక్షన్కు కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో సెంట్రల్ కాంట్రాక్టు నుండి అతనిని బీసీసీఐ తప్పించింది. ఇక మహీ స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశాలిచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2020 నిరవధిక వాయిదా పడింది. దీంతో ధోనీ ప్రొఫెషనల్ క్రికెట్లోకి తిరిగి రావడాన్ని ఆలస్యం చేసింది. ఐపీఎల్లో మహీ బాగా రాణించినట్లయితే.. అక్టోబర్-నవంబర్లో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం ఉండేది. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు. లీగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో కచ్చితంగా చెప్పలేం. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు డైలమాలో పడింది.
టోక్యో షెడ్యూల్ విడుదల.. న్యూజిలాండ్తో భారత్ తొలి మ్యాచ్!!