'ఈ తరంలో అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ బ్యాట్స్మన్ కోహ్లీనే'

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ తరంలోనే అత్యుత్తమ బ్యాట్స్మన్ అని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ పేర్కొన్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్లో "రెడ్ బాల్, వైట్ బాల్, ఇప్పుడు పింక్ బాల్. ఈ తరంలో అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ బ్యాట్స్మన్ కోహ్లీనే" అని ట్వీట్ చేశాడు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న చారిత్రాత్మక డే నైట్ టెస్టులో విరాట్ కోహ్లీ(136) టెస్టుల్లో 27వ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ 159 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 101 పరుగులతో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 27వ సెంచరీ కాగా మొత్తంగా 70వ సెంచరీ.
వన్డేల్లో ఇప్పటికే విరాట్ కోహ్లీ 43 సెంచరీలు బాదిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు తెలుపు, ఎర్ర బంతులతో జరిగిన మ్యాచ్ల్లో సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లీ తాజాగా పింక్ బాల్ టెస్టులో సైతం సెంచరీ సాధించాడు. ఫలితంగా భారత్లో జరిగిన తొలి పింక్ బాల్ టెస్టులో తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

స్మిత్ రికార్డు బద్దలు
ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్(26 సెంచరీలు) రికార్డును విరాట్ కోహ్లీ అధిగమించాడు. దీంతో పాటు టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ 27 టెస్టు సెంచరీలతో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్తో కలిసి 17వ స్థానంలో కొనసాగుతున్నాడు.
మూడో స్థానంలో కోహ్లీ
ఇక, అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లు కలిపి అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ ప్రస్తుతం 438 ఇన్నింగ్స్ల్లో 70 సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (782 ఇన్నింగ్స్ల్లో 100 సెంచరీలు) అగ్రస్థానంలో ఉండగా, రికీ పాంటింగ్(668 ఇన్నింగ్స్ల్లో 71 సెంచరీలు) రెండో స్థానంలో ఉన్నాడు.
కెప్టెన్గా 41 అంతర్జాతీయ సెంచరీలు
కెప్టెన్గా 41 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన కోహ్లీ... మూడు ఫార్మాట్లలో కెప్టెన్గా అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్గా ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ రికార్డు సమం చేశాడు. ఈ ఏడాది 8వ టెస్టు మ్యాచ్ ఆడుతోన్న విరాట్ కోహ్లీ కోల్కతా వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమిండియాను విజయం దిశగా నడిపిస్తున్నాడు.

ప్రముఖ టెస్టు స్టేడియాల్లో సెంచరీలు
ఇక, భారత్లోని ప్రముఖ టెస్టు స్టేడియాలైన ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వేదికల్లో గుండప్ప విశ్వనాథ్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ల తర్వాత టెస్టు సెంచరీలు సాధించి క్రికెటర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈడెన్లో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్లో కోహ్లీ సెంచరీతో అనేక రికార్డులు సొంతమయ్యాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications