ముంబైలోని వాంఖడే వేదికగా ఈరోజు రాత్రి 7.30గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఢిల్లీ క్యాపిటల్స్కు ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై.. ఈ మ్యాచ్ను గెలిచి గౌరవప్రదంగా ఈ సీజన్ను ముగించాలనుకుంటుంది. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ప్లేఆఫ్స్ చేరాలంటే ముంబై తప్పకుండా గెలవాలి. ముంబై ఓడితే ఆర్సీబీ తట్టాబుట్టా సర్దుకోవడం ఖాయం. ఈ మ్యాచ్ కోసం మూడు జట్ల అభిమానులు తీవ్ర ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ఆర్సీబీ ప్రస్తుతం ఐపీఎల్ 2022 పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. అయితే నెగెటివ్ నెట్ రన్ రేట్ (-0.253) కలిగి ఉంది. పాజిటివ్ (+0.255) నెట్ రన్ రేట్ ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. 14పాయింట్లతో 5వ స్థానంలో ఉండగా ఆర్సీబీ 16పాయింట్లతో కొనసాగుతుంది. ఢిల్లీ ఓడిపోతే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా పాయింట్ల ఆధారంగా ఆర్సీబీ ప్లేఆఫ్ చేరుతుంది. ఢిల్లీ గెలిస్తే పాజిటివ్ నెట్ రన్ రేట్ వల్ల ఢిల్లీ ప్లేఆఫ్ చేరుతుంది.
ఈక్రమంలో ఇరు జట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్ గ్రౌండ్లోకి వచ్చారు. టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక రోహిత్ మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ చేయబోతున్నాం. మంచి ట్రాక్ కన్పిస్తుందు. ముందు మంచి స్కోర్ చేయకుండా ఢిల్లీని కట్టడి చేయాలనుకుంటున్నాం. అందుకు మాకంటూ కొన్ని ప్లాన్సు ఉన్నాయి. మేము ఈ సీజన్ అంత నిలకడ లేమి ప్రదర్శన కనబరిచాం. సమిష్టిగా రాణించాల్సిన అవసరముంది. చివరి మ్యాచ్ కాబట్టి కచ్చితంగా మాపై అభిమానుల ఆశలుంటాయి. కాబట్టి మేము ఉత్తమమైన ఆటను మా నుంచి తీసుకురావాలి. గత కొన్ని మ్యాచ్లలో వచ్చే సీజన్ను దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రయోగాలు చేశాం.
ఇకపోతే మా జట్టులో రెండు మార్పులున్నాయి. త్రిస్టన్ స్టబ్స్ స్థానంలో బ్రెవిస్, గాయపడిన సంజయ్ స్థానంలో షోకీన్ జట్టులో చేరారు. ఇక అర్జున్ టెండూల్కర్కు చివరి మ్యాచ్ లో కూడా స్థానం కల్పించకపోవడంతో అభిమానులు ఉసూరుమంటున్నారు. టాస్ ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ.. మేము కూడా ముందు బౌలింగ్ చేయాలనుకున్నాం కానీ టాస్ మాకు రాలేదు. ఏం చేస్తాం. ఇక లలిత్ యాదవ్ స్థానంలో పృథ్వీ షా తుది జట్టులోకి వచ్చాడని పేర్కొన్నాడు. పృథ్వీ షా బరిలోకి దిగడంతో ఢిల్లీ జట్టు ఓపెనింగ్ బలోపేతం కానుంది. సరైన టైంలో షా దిగాడు.
తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(వికెట్ కీపర్ / కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, రోవ్మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), డేనియల్ సామ్స్, తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్, టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, హృతిక్ షోకీన్, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్, మయాంక్ మార్కండే