2018లో నిరాశే:
2018 ఐపీఎల్ వేలం కోసం ఇంగ్లండ్ టెస్టు టీమ్ కెప్టెన్ జో రూట్ తన పేరును నమోదు చేసుకున్నాడు. అయితే టెస్ట్ ఆటగాడిగా ముద్రపడిన అతడిని ఏ జట్టు కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. ఇక ఐపీఎల్ 2019, 2020లో రూట్ ఆడేందుకు ఆసక్తి చూపించలేదు. ఆ సమయంలో ఇంగ్లండ్ జట్టుకు టెస్ట్ క్రికెట్ మ్యాచులు ఎక్కువగా ఉండడమే అందుకు కారణం. అయితే వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో.. ఇంగ్లండ్ జట్టులో రూట్ ఆడాలని కోరుకుంటున్నాడు. అందుకోసమే ఐపీఎల్ 2022 ఆడాలని రూట్ పట్టుదలతో ఉన్నాడు. ఇక్కడ ఆకట్టుకుని ఇంగ్లండ్ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలని చూస్తున్నాడు.
16 మంది విదేశీ ఆటగాళ్లకు అవకాశం:
వచ్చే ఏడాది ఐపీఎల్లో రెండు టీమ్స్ కొత్తగా చేరనున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2022 కోసం మెగావేలం జరగనుంది. దాంతో దాదాపుగా 50 మందికి అవకాశం రానుంది. భారత ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లకు కూడా భారీగానే డిమాండ్ ఉంటుంది. 16 మంది విదేశీ ఆటగాళ్లకు ఐపీఎల్లో ఆడేందుకు అవకాశం లభించనుంది. ఈ నేపథ్యంలో జో రూట్ వేలంలో అమ్ముడయ్యే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ వేలంలో పాల్గొనడం సహా.. టీ20 ఫార్మాట్లో రాణించాలనే థ్యేయంతో రూట్ ఉన్నాడు.
రెండు సంవత్సరాలుగా:
జో రూట్ చివరిసారి 2019 మేలో పాకిస్తాన్ జట్టుపై ఇంగ్లండ్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ వేదికపై రెండు సంవత్సరాలుగా రూట్ ఎలాంటి టీ20 క్రికెట్ ఆడలేదు. 2016 టీ20 ప్రపంచకప్లో రూట్ ఆరు మ్యాచులలో 239 పరుగులు చేశాడు. 49.40 సగటు మరియు 146.47 స్ట్రయిక్ రేట్తో ఇంగ్లండ్ జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక టీ20 క్రికెట్లో 32 మ్యాచ్ల్లో 35.72 సగటుతో 893 పరుగులతో ఆకట్టుకునే రికార్డును కలిగి ఉన్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరగనున్న యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్గా జో రూట్ సిద్ధమవుతున్నాడు.
వేలంలోనైనా భాగమవుతా:
ఐపీఎల్ 2021 వేలం నుంచి తాను ఎందుకు తప్పుకున్నాడో జో రూట్ గతంలోనే చెప్పాడు. 'ఐపీఎల్ 2021 వేలం నుంచి తప్పుకోవడం కఠిన నిర్ణయమే. ఐపీఎల్లో భాగమయ్యేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నా. ఈ ఏడాది చాలా టెస్టు క్రికెట్ ఉంది. అందుకే లీగులో ఆడేందుకు ఇది సరైన సమయంగా భావించడం లేదు. పూర్తిగా ఏకాగ్రత కనబర్చలేనని అనిపిస్తోంది. ఇప్పుడు లభిస్తున్న మొత్తంతోనే ఇంగ్లండ్ క్రికెట్కు అత్యుత్తమ సేవ చేస్తున్నానని అనుకోను. బహుశా వచ్చే ఏడాది ఐపీఎల్లో ఆడతా. కనీసం వేలంలోనైనా భాగమవుతా' అని తెలిపాడు.