

హైదరాబాద్: మొహాలీ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో భారత ఇన్నింగ్స్ చివరి బంతికి పేసర్ జస్ప్రీత్ బుమ్రా సిక్స్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 19 ఏళ్ల రికార్డును బుమ్రా సమం చేశాడు. ఈ మ్యాచ్లో 11వ బ్యాట్స్మన్గా బరిలోకి దిగిన బుమ్రా.. చివరి బంతిని సిక్సర్గా మలిచాడు. తద్వారా 2000వ సంవత్సరం ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే పోటీలో మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ కొట్టిన సిక్సర్ రికార్డును బుమ్రా సమం చేశాడు.
వన్డేల్లో బుమ్రా కొట్టి తొలి సిక్సర్ ఇదే కావడం గమనార్హం. బుమ్రా పాల్గొన్న 100 అంతర్జాతీయ పోటీలో బుమ్రా ఈ రికార్డును అధిగమించాడు.
ఈ నేపథ్యంలో బుమ్రా సిక్స్కు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిదా అయ్యాడు. బుమ్రా సిక్స్ కొట్టిన ఆనందరంలో విరాట్ కోహ్లీ ఎగిరి గంతేస్తూ చప్పట్లు చరిచాడు. కోహ్లీతో పాటు మిగతా ఆటగాళ్లు కూడా సంబరాలు చేసుకున్నారు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన పాట్ కమిన్స్ బౌలింగ్లో తొలి బంతిని సిక్స్గా మలిచిన విజయ్ శంకర్ మూడో బంతికి ఔటయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన చాహల్ ఐదో బంతికి ఔటవ్వగా చివరి వికెట్గా బుమ్రా క్రీజులోకి వచ్చాడు. అప్పటికే ఐదు వికెట్లు పడగొట్టిన కమిన్స్.. బుమ్రాని ఔట్ చేస్తాడు లేదా కనీసం బంతిని డాట్ చేస్తాడని అంతా భావించారు. అయితే, ఆఖరి బంతిని కళ్లుచెదిరే రీతిలో లాంగాన్ దిశగా సిక్స్గా మలిచాడు. తన క్రికెట్ కెరీర్లో బుమ్రాకి ఇది ఏడో సిక్స్.
లిస్ట్-ఏ గేమ్లో నాలుగు... టీ20ల్లో మూడు సిక్సులను బాదాడు. అయితే, అంతర్జాతీయ మ్యాచ్లో మొదటిసారి సిక్స్ బాదడంతో ఒక్కసారిగా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో సంబరాలు మొదలయ్యాయి. బుమ్రా సిక్స్కి కెప్టెన్ విరాట్ కోహ్లి మాత్రం ఆనందంతో తెగ మురిసిపోయాడు. చప్పట్లు కొడుతూ బుమ్రాను మెచ్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.