ప్రయాణ ఆంక్షలున్న నేపథ్యంలో:
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేయడంతో ఐపీఎల్ 2020ని నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే.. ఆ విండోలో ఐపీఎల్ను నిర్వహించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) భావిస్తోంది. ప్రయాణ ఆంక్షలున్న నేపథ్యంలో భారతీయ ఆటగాళ్లతోనే ఐపీఎల్ నిర్వహించాలని రాజస్థాన్ రాయల్స్ చేసిన ప్రతిపాదనను చెన్నై వ్యతిరేకించింది. ఇప్పుడు పంజాబ్ దానికి మద్దతు ప్రకటించింది.
విదేశీ స్టార్లు లేకుండా ఐపీఎల్ నిర్వహించొద్దు
'భారతీయులు రూపొందించిన ఐపీఎల్ అంతర్జాతీయ క్రికెట్ టోర్నీ. ప్రపంచంలోనే అత్యుత్తమ టోర్నీ. అందుకే అంతర్జాతీయ స్టార్లు దీనికి అవసరం. ప్రయాణ ఆంక్షలను బట్టి ఏయే దేశాల ఆటగాళ్ల వస్తారో ఇప్పుడే చెప్పలేం. టోర్నీ ఎప్పుడు మొదలవుతుందో చెప్పాలంటే.. బీసీసీఐ చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వైరస్ ఇంకా పెరిగితే ఏం చేయాలి.. అప్పుడేమవుతుంది.. ప్రస్తుతం ఈ విషయాలు తప్ప మరో దానిని ఆలోచించలేం' అని నెస్వాడియా అన్నారు.
ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు
భారత్లో జులై-ఆగస్టులో ఐపీఎల్ ఆరంభంపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని నెస్వాడియా పేర్కొన్నారు. 'ప్రస్తుత పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్నదే మనకు అత్యంత ముఖ్యం. ఇది మరో రెండు నెలలు లేదా అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు. వైరస్ తగ్గాక ఐపీఎల్ ఎప్పుడు నిర్వహించాలో స్పష్టత వస్తుంది. లీగ్ మొదలైతే భారత అభిమానులు సంతోషిస్తారని తెలుసు. జర్మనీలో ఫుట్బాల్ మొదలైంది. త్వరలోనే ఈపీఎల్ ఆరంభమవుతుంది. కనీసం మరో రెండు నెలలు వైరస్తో పోరాడిన తర్వాతే ఐపీఎల్ నిర్వహణ అవకాశాలు తెలుస్తాయి' అని వాడియా అన్నారు.
ప్రపంచకప్ వాయిదా పడితే
ఈ ఏడాది అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ అయి ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠకు మరో 15 రోజుల్లో తెరపడే అవకాశం ఉంది. కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కారణంగా ఈ మెగా టోర్నీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ).. 2022కు వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని దేశాల బోర్డు సభ్యులతో పొట్టి ప్రపంచకప్ నిర్వహణ అంశంపై ఐసీసీ మరోసారి (జూన్ 10 తర్వాత) చర్చించనుంది. అయితే వాయిదా వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రపంచకప్ వాయిదా పడితే.. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఐపీఎల్ నిర్వహించుకోవడానికి మార్గం సుగుమం అవుతుంది.