ఈ సారి ఐపీఎల్లోకి కొత్తగా అడుగుపెట్టిన అహ్మదాబాద్ తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. తమ జట్టుకు 'గుజరాత్ టైటాన్స్' అని పేరు పెట్టినట్లు వెల్లడించింది. సీవీసీ క్యాపిటల్స్ అహ్మదాబాద్ ప్రాంచైజీని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ శనివారమే ఐపీఎల్ మెగా వేలం జరగబోతూ ఉండడంతో సీవీసీ క్యాపిటల్స్ యాజమాన్యం తమ జట్టుకు గుజరాత్ టైటాన్స్గా పేరును ఖరారు చేసింది. ఐపీఎల్లోకి అరంగేంట్రం చేస్తున్న ఆ జట్టు గుజరాత్ క్రికెట్ వారసత్వాన్ని కొనసాగిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ భారత క్రికెట్కు ఎంతో మంది లెజెండరీ ఆటగాళ్లను అందించందని ఈ సందర్భంగా గుర్తు చేసింది.
ధైర్యవంతమైన, విశాల హృదయంతో కూడిన జట్టుగా ఉండాలని తాము భావిస్తున్నామని ఆ జట్టు సీఈఓ సిద్ధార్థ్ పటేల్ పేర్కొన్నారు. తమ జట్టు గొప్ప గొప్ప విజయాలు సాధించాలని ఆయన ఆశించారు. తమ ఫ్రాంచైజీ ప్రధాన లక్ష్యం ప్రపంచంలో ఎక్కడైనా అత్యంత స్ఫూర్తిదాయకంగా, అందరినీ కలుపుకొని పోవడమేనని తెలిపారు. దీర్ఘకాలిక విజయాలు, ఖ్యాతిని బలపరిచేందుకు ఇది సహాయపడుతుందని సిద్దార్థ్ చెప్పుకొచ్చారు. మెగా వేలంలో తాము సరైన ఆటగాళ్లను కొనుగోలు చేస్తామని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. నైపుణ్యం మాత్రమే కాకుండా, ప్రేరణ కలిగించే ఆటగాళ్లను తమ ఫ్రాంచైజీ కోరుకుంటోందని సిద్ధార్థ్ పటేల్ పేర్కొన్నారు.
ఇక గుజరాత్ టైటాన్స్ వేలానికి ముందే ముగ్గురు ఆటగాళ్లను తమ రిటెన్షన్ జాబితాలో చేర్చుకుంది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతోపాటు యువ ఓపెనర్ శుభ్మాన్ గిల్, ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్కు రిటెన్షన్ జాబితాలో చోటు కల్పించింది. ఇందుకోసం హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్కు 15 కోట్ల రూపాయల చొప్పున చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇక యువ ఓపెనర్ శుభ్మన్ గిల్కు 8 కోట్ల రూపాయలు చెల్లించనుంది. దీంతో ఈ నెల 12, 13వ తేదీలలో జరగనున్న మెగా వేలానికి ఆ జట్టు దగ్గర ఇంకా 52 కోట్ల రూపాయలు మిగిలి ఉన్నాయి. ఇక ఇదివరకే గుజరాత్ జట్టు తమ కోచింగ్ స్టాఫ్ను కూడా ప్రకటించింది. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ విక్రమ్ సోలంకీని గుజరాత్ టైటాన్స్ తమ జట్టు డైరెక్టర్గా నియమించింది. టీమిండియా మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రాని ఫ్రాంచైజీకి ప్రధాన కోచ్గా ఉండగా, మాజీ ప్రపంచ కప్ విన్నింగ్ కోచ్, దక్షిణాఫ్రికా ఓపెనర్ గ్యారీ కిర్స్టన్ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్, బ్యాటింగ్ కోచ్గా వ్యవహరించనున్నారు.