బఫె భోజనానికి వచ్చినట్టు..
ఓపెనర్లు న్యాయం చేస్తున్నప్పటికీ.. ఆ తరువాత వచ్చే బ్యాట్స్మెన్లెవరూ క్రీజ్లో నిలదొక్కుకోలేకపోతున్నారు. ఒకరి తరువాత ఒకరుగా పెవిలియన్ దారి పడుతున్నారు. బఫె భోజనానికి వచ్చినట్టు వచ్చి వెళ్తున్నారే తప్ప కమిట్మెంట్తో ఎవరూ ఆడట్లేదంటూ నెటిజన్లు, ట్విట్టరెటీలు కామెంట్స్ పెడుతున్నారు. హైదరాబాదీ టీమ్ కావడంతో.. తెలంగాణ యాసను కలిపి మరీ విమర్శలను సంధిస్తున్నారు తమ వ్యాఖ్యలతో అదరగొడుతున్నారు. కేన్ విలియమ్సన్ వస్తే గానీ జట్టు గాడిలో పడబోదంటూ జోస్యం చెబుతున్నారు. కేన్ లేని లోటును బాగా ఫీల్ అవుతున్నారు.
గెలిచి తీరాల్సిన మ్యాచ్..
సన్రైజర్స్ హైదరాబాద్ తన తరువాతి మ్యాచ్ను పంజాబ్ కింగ్స్తో ఆడనుంది. బుధవారం మధ్యాహ్నం ఈ మ్యాచ్ జరుగనుంది. చెన్నై చెపాక్లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ఆరంభమౌతుంది. హైదరాబాద్ గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్లో భారీ తేడాతో విజయం సాధిస్తే గానీ.. నెట్ రన్రేట్ను మెరుగుపరచుకోలేదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టుడుగున ఉంది వార్నర్ సేన. మూడు మ్యాచ్లు ఆడినప్పటికీ ఆ జట్టు ఖాతాలో ఒక్క పాయింట్ జమ కాలేదు. నెట్ రన్రేట్ మైనస్ 0.483 వద్ద నిలిచింది. పంజాబ్ కింగ్స్తో భారీ తేడాతో గెలిస్తే.. ఒకటో, రెండో మెట్లు ఫైకి ఎగబాకడానికి అవకాశం ఉంది.
పంజాబ్ కింగ్స్ పరిస్థితీ అంతంతే..
మరోవంక- పంజాబ్ కింగ్స్ జట్టు పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై 221 భారీ పరుగులు చేసి, గెలిచిన ఆ జట్టు.. ఆ తరువాతి మ్యాచ్లో ఓడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్పై కనాకష్టంగా వంద పరుగులు చేయగలిగింది. కాస్త గట్టిగా బౌలింగ్ చేయగలిగితే పంజాబ్ కింగ్స్ జట్టు కూడా పేకమేడలా కుప్పకూలుతుంది. సన్ రైజర్స్ బౌలింగ్ ఫర్వాలేదనిపిస్తున్నప్పటికీ.. లోపమంతా బ్యాటింగ్లోనే ఉంది. ఓపెనర్లు తప్ప మరెవరూ రాణించట్లేదు. టాప్ ఆర్డర్ పరిస్థితి కూడా అంతే. బౌలర్లు శ్రమించి పంజాబ్ కింగ్స్ను పరిమిత స్కోరు వద్దే కట్టడి చేసినప్పటికీ.. బ్యాట్స్మెన్లు ఎలా రాణిస్తారనే దానిపైనే హైదరాబాద్ విజయం ఆధారపడి ఉంది.
ఆ మ్యాచ్ ఓడితే కోలుకోలేకపోవచ్చు..
పంజాబ్తో మ్యాచ్ కీలకంగా మారింది హైదరాబాద్కు. ఆ మ్యాచ్ కూడా హరీ అనిపిస్తే.. ఇక టోర్నమెంట్లో ముందుకెళ్లడం దాదాపు అసాధ్యమే అవుతుంది. శనివారం రాత్రి చెన్నై చెపాక్లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్తో తలపడ్డ సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ మరోసారి ఘోరంగా ఓడిపోయింది. 150 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. ఈ సీజన్లో హైదరాబాద్ జట్టుకు ఇది వరుసగా మూడో ఓటమి. ఆడిన మూడు మ్యాచుల్లోనూ దారుణ పరాజయాన్ని చవి చూసింది. ఓ ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ టీమ్ వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి. 13 ఎడిషన్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు.