అబుదాబి: షేక్ జాయెద్ స్టేడియం వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ గౌరవ ప్రదమైన స్కోర్ చేసింది. యువ బ్యాట్స్మన్ శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ (57; 42 బంతుల్లో 5 ఫోర్లు) చేయగా.. ఐపీఎల్ 2020లో కెప్టెన్ దినేశ్ కార్తీక్ (58; 29 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులు) మొదటిసారి మెరిశాడు. 22 బంతుల్లోనే కార్తీక్ హాఫ్ సెంచరీ చేయడంతో కోల్కతా 6 వికెట్ల నష్టానికి 164 రన్స్ చేసి.. పంజాబ్ ముందు 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. పంజాబ్ బౌలర్లలో మొహమ్మద్ షమీ, అక్షర్ దీప్ సింగ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్కు వచ్చిన కోల్కతాకు శుభారంభం దక్కలేదు. ఆది నుంచే తడబడుతూ బ్యాటింగ్ చేసిన ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (4; 10 బంతుల్లో, 1×4)ని మూడో ఓవర్లో మొహమ్మద్ షమి క్లీన్బౌల్డ్ చేశాడు. కొద్దిసేపటికే వన్డౌన్లో వచ్చిన నితీష్ రాణా (2; 4 బంతుల్లో) ఫన్నీగా రనౌట్ అయ్యాడు. అర్షదీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్లో శుభ్మన్ గిల్ ఫైన్ లెగ్ దిశగా ఆడాడు. రాణా సింగిల్ కోసం వేగంగా పరుగెత్తాడు. ముందు పరుగు కోసం ప్రయత్నించిన గిల్.. బంతి షమీ దగ్గరకు వెళ్లడంతో క్రీజ్లోకి వచ్చేశాడు. ఇదేమీ గమనించని రాణా.. నాన్ స్ట్రయికర్ ఎండ్ నుంచి స్ట్రైకర్ ఎండ్కు వెళ్ళిపోయాడు. పూరన్ పరుగెత్తుకుంటూ వెళ్లి వికెట్లను గిరాటేశాడు.
ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన హార్డ్ హిట్టర్ ఇయాన్ మోర్గాన్ (24; 23 బంతుల్లో, 2×4, 1×6)తో కలిసి శుభ్మన్ గిల్ (57; 47 బంతుల్లో, 4×5) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే దూకుడుగా ఆడే యత్నంలో బిష్ణోయ్ బౌలింగ్లో మోర్గాన్ వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన దినేష్ కార్తిక్ ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేశాడు. ఆది నుంచే దూకుడుగా ఆడుతూ బౌండరీల మోత మోగించాడు. అర్షదీప్ వేసిన 15వ ఓవర్లో మూడు బౌండరీలు బాదిన అతడు జోర్డాన్ వేసిన తర్వాతి ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్తో విరుచుకుపడ్డాడు.
దినేష్ కార్తిక్ ఫోర్లు, సిక్సులు బాదుతూ 22 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. మరోవైపు గిల్ కూడా నిలకడగా ఆడుతూ 42 బంతుల్లో హాఫ్సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 18వ ఓవర్లో రెండో పరుగుకు ప్రయత్నించి గిల్ రనౌటయ్యాడు. 13 ఓవర్లకు 75 పరుగులు చేసిన కోల్కతా.. ఆఖరి 7 ఓవర్లలో 89 పరుగులు సాధించింది. ఆండ్రీ రసెల్ (5) మరోసారి నిరాశపరిచాడు. ఆఖరి రెండు ఓవర్లలో పంజాబ్ కట్టుదిట్టంగా బంతులేయడంతో కార్తీక్ క్రీజులోనే ఉన్నా ఇన్నింగ్స్ను ఘనంగా ముగించలేకపోయింది. పంజాబ్ బౌలర్లలో షమి, అర్షదీప్, బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.
KXIP vs KKR: ఫన్నీ రనౌట్.. ఒకే ఎండ్లోకి ఇద్దరు బ్యాట్స్మెన్లు!!