
హైదరాబాద్: ముంబై ఇండియన్స్ ఓటమికి గాను తనపై మీడియాలో వచ్చిన కథనాలపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా మరోసారి మంగళవారం స్పందించారు. ముంబై ఓడిపోయినందుకు తానేం సంతోషపడలేదని, తమ జట్టు అవకాశం కోసమే అలా స్పందించానని మరోసారి పేర్కొన్నారు.
లీగ్ దశలో భాగంగా ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ డేర్డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ముంబై జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. అదే సమయంలో తమ జట్టు మ్యాచ్ కోసం పుణెలో ఉన్న ప్రీతి జింటాకు ఈ విషయం తెలిసి తెగ సంబరపడింది.
ఆమె మురిసిపోతూ 'నిజంగా... నాకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి ముంబై ఫైనల్కు వెళ్లడం లేదు. నేనైతే హ్యాపీ' అని ఆమె పేర్కొన్నట్టు వీడియోలో కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ముంబై ఓటమి పాలైన తర్వాత తాను ఎందుకు ఆనందం వ్యక్తం చేశాననే దానిపై ప్రీతిజింటా ట్విట్టర్ వేదికగా అభిమానులకు వివరణ కూడా ఇచ్చింది.
తమ జట్టు ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ముందుగా ముంబై ఇండియన్స్ ఓడిపోతేనే అది జరుగుతుందని ఆమె తెలిపారు. ఇందులో భాగంగానే ముంబై ఇండియన్స్ ఓటమి తర్వాత తాను సంతోషాన్ని పంచుకున్నట్లు ట్విట్టర్లో ప్రీతి జింటా వివరించింది. అంతేకానీ తనకు ముంబై ఇండియన్స్పై వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదని తెలిపింది.
తాజాగా ఆమె మంగళవారం సంచలనాల కోసం మీడియా అత్యుత్సాహంతో వార్తలు రాస్తోందని ఆమె అసహనం వ్యక్తం చేశారు. 'మా జట్టు చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయింది. అప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టు సంతోషం వ్యక్తం చేసి ఉండొచ్చు. ఎవరి జట్ల కోసం వాళ్లు ఆలోచించటంలో తప్పులేదు. వేరే జట్టు ప్లేఆఫ్కు అర్హత సాధిస్తే నేను సంబరపడలేను కదా! ముంబై ఓడి పోయినందుకు నేను ఆనంద పడలేదు.. మా జట్టు పరిస్థితిపై మాత్రమే ఆందోళన చెందాను పంజాబ్ నాకౌట్కి చేరుకోలేక పోవడం బాధాకరం' అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
'మా జట్టు ప్లేఆఫ్కు చేరుకునేందుకు గొప్ప అవకాశం లభించింది. కానీ విజయమే వరించలేదు. ఫైనల్స్లో ఏ జట్టు గెలిచినా ఫర్వాలేదు. కానీ, ఇష్టమొచ్చినట్లు వార్తలు రాయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా'ని ఆమె పేర్కొన్నారు.