క్రిస్ గేల్ (30 బంతులు), ఐపీఎల్ 2013: పూణెతో జరిగిన మ్యాచ్లో
'యూనివర్స్ బాస్'గా పేరొందిన ఈ వెస్టిండిస్ క్రికెటర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఆటగాడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు. పూణెతో జరిగిన మ్యాచ్లో కేవలం 30 బంతుల్లో సెంచరీని నమోదు చేశాడు. ఇప్పటికీ ఐపీఎల్లో అత్యంత వేగంగా సాధించిన సెంచరీ ఇదే కావడం విశేషం.
యూసఫ్ పఠాన్ (37 బంతులు), ఐపీఎల్ 2010: రాజస్థాన్ రాయల్స్పై
బరోడాకు చెందిన ఈ ఆల్ రౌండర్ పవర్ హిట్టర్ బ్యాట్స్ మెన్గా పేరుగాంచాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఈ మ్యా లో పఠాన్ 37 బంతుల్లో సెంచరీ చేశాడు. అందులో 8 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి.
డేవిడ్ మిల్లర్ (38 బంతులు), ఐపీఎల్ 2013: బెంగళూరుపై
దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్ ఐపీఎల్లో విధ్వంసకర బ్యాట్స్మెన్గా పేరుగాంచాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 140 పరుగులు కావాల్సిన తరుణంలో క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 14వ ఓవర్లో 38 బంతుల్లో సెంచరీని సాధించిన మిల్లర్ మరో రెండు ఓవర్లు మిగిలుండగానే జట్టుకు విజయాన్నందించాడు.
ఆడమ్ గిల్ క్రిస్ట్ (42 బంతులు), ఐపీఎల్ 2008: ముంబై ఇండియన్స్పై
ఆస్ట్రేలియాకు చెందిన ఈ వెటరన్ క్రికెటర్ 42 బంతుల్లో సెంచరీని సాధించాడు. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై డెక్కన్ ఛార్జర్స్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో 154 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన డెక్కన్ ఛార్జర్స్ 12వ ఓవర్లోనే విజయం సాధించింది. వీవీఎస్ లక్ష్మణ్తో కలిసి గిల్ క్రిస్ట్ 10 సిక్సులు, 9 ఫోర్ల సాయంతో సెంచరీని సాధించాడు.
ఏబీ డివిలియర్స్ (42 బంతులు), ఐపీఎల్ 2016: గుజరాత్ లయన్స్పై
ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ సెంచరీలతో రాణించారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. కోహ్లీ, ఏబీ ఇద్దరూ పోటీ పడి మరీ ఫోర్లు, సిక్సులు బాదారు. అయితే చివరకు ఏబీనే ముందు 42 బంతుల్లో 12 సిక్సులు, 10 ఫోర్ల సాయంతో సెంచరీ సాధించాడు.
డేవిడ్ వార్నర్ (43 బంతులు), ఐపీఎల్ 2017: కోల్కతాపై
కోల్కతాతో జరిగిన ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సెంచరీకి అభిమానులు ముగ్దులయ్యారు. 43 బంతుల్లో వార్నర్ సెంచరీని సాధించాడు. ఈ మ్యాచ్లో మొత్తం 50 బంతుల్లో 126 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 11వ ఓవర్లోనే వార్నర్ ఎనిమిది సిక్సులు, పది బౌండరీలతో సెంచరీ సాధించాడు.
సనత్ జయసూర్య(45 బంతులు), ఐపీఎల్ 2008: చెన్నైపై
శ్రీలంకకు చెందిన ఈ వెటరన్ క్రికెటర్ 45 బంతుల్లో సెంచరీని సాధించాడు. 157 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 25 బంతులు మిగులుండగానే లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్లో జయసూర్య 48 బంతుల్లో 114 పరుగులతో సెంచరీని నమోదు చేశాడు.
మురళీ విజయ్ (46 బంతులు), ఐపీఎల్ 2010: రాజస్థాన్ రాయల్స్పై
టెస్టు ప్లేయర్గా తనపై ఉన్న ముద్రను తొలగించుకునే క్రమంలో మురళీ విజయ్ ఎంతో అద్భుతంగా రాణించిన మ్యాచ్ ఇది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఈ మ్యాచ్లో 46 బంతుల్లో మురళీ విజయ్ సెంచరీని నమోదు చేశాడు. చివరి 10 ఓవర్లలో చెన్నై 155 పరుగులు చేసింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి చెన్నై 246 పరుగులు చేసింది.
క్రిస్ గేల్ (46 బంతులు), ఐపీఎల్ 2015: కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై
ఐపీఎల్లో విధ్వంసకర బ్యాట్స్మెన్గా పేరొందిన క్రిస్ గేల్ అత్యంత వేగంగా సాధించిన రెండో సెంచరీ ఇది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో క్రిస్ గేల్ మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. కేవలం 46 బంతుల్లో క్రిస్ గేల్ సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్ క్రిస్ గేల్ 57 బంతుల్లో 117 పరుగులు చేశాడు. గేల్ పవర్ హిట్ బ్యాటింగ్తో బెంగళూరు 226 పరుగులు చేసింది.
క్రిస్ గేల్ (46 బంతులు), ఐపీఎల్ 2011: కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై
ఐపీఎల్ 2011 సీజన్లో క్రిస్ గేల్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ సీజన్లో గేల్ రెండు సెంచరీలతో ఐపీఎల్లో అత్యధికంగా 608 పరుగులు చేశాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో క్రిస్ గేల్ సాధించిన ఈ సెంచరీ ఐపీఎల్ టోర్నీలో రెండో సెంచరీ కావడం విశేషం. 49 బంతుల్లో క్రిస్ గేల్ 107 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో తొలి ఆరు పరుగుల కోసం గేల్ 13 బంతులు ఆడాడు.