కోల్కతా: ఈ ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్లో భారత క్రీడా బృందానికి 'గుడ్విల్ అంబాసిడర్'గా ఉండాలంటూ టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) కోరింది. ఈ మేరకు గంగూలీకి ఐవోఏ కార్యదర్శి రాజీవ్ మెహతా ఓ లేఖ రాశారు. గతేడాది బీసీసీఐ పగ్గాలు చేపట్టిన దాదా తనదైన స్టయిల్లో ముందుకువెళుతున్న విషయం తెలిసిందే.
విక్టరీ డ్యాన్స్.. చహల్, అయ్యర్ స్టెప్పులు (వీడియో)!!
'టోక్యో ఒలింపిక్స్లో 14-16 క్రీడా విభాగాల్లో భారత్ నుండి 100-200 మంది అథ్లెట్లు పాల్గొంటారని భావిస్తున్నాం. వీరిలో సీనియర్లు, ఒలింపిక్స్ అనుభవం లేని యువకులు ఉన్నారు. కోట్లాది మంది భారతీయులకు మీరు స్ఫూర్తిగా నిలిచారు. ఓ మంచి పాలకుడిగా యువ ఆటగాళ్లను సానబెడుతున్నారు. భారత బృందానికి మీ మద్దతు ప్రేరణగా నిలుస్తుంది. మా విజ్ఞప్తిని అంగీకరిస్తారని ఆశిస్తున్నాం' అని లేఖలో మెహతా పేర్కొన్నారు.
'ఒలింపిక్స్లో ఈ ఎడిషన్ ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ క్రీడలలో దేశం వందవ సంవత్సరం పాల్గొనబోతోంది. గంగూలీ మద్దతు మరియు ప్రేరణ భారత అథ్లెట్లకు చాలా విలువైనది. ముఖ్యంగా యువకులకు స్ఫూర్తిగా ఉంటారు. పాలకుడిగా యువ ఆటగాళ్లను పెంపొందింస్తున్నారు' అని రాజీవ్ మెహతా అన్నారు.
టోక్యో ఒలింపిక్స్ ఈ ఏడాది జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు జపాన్లోని టోక్యో నగరంలో జరగునున్నాయి. 2016 రియో ఒలింపిక్స్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, షూటర్ అభినవ్ బింద్రా, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ 'గుడ్విల్ అంబాసిడర్స్'గా వ్యవహరించిన విషయం తెలిసిందే.