|
65 పరుగులకే..
బంగ్లాదేశ్లోని సిల్హెట్లో జరిగిన శ్రీలంకపై జరిగిన ఫైనల్లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. ప్రత్యర్థిని 65 పరుగులకే కుప్పకూల్చింది. బౌలర్ల దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్లను కోల్పోయి 65 పరుగులు మాత్రమే చేసింది. శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్లో ఇద్దరు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ అది కూడా.. 20లోపే చేశారు. 32 పరుగులకు ఎనిమిది వికెట్లను కోల్పోయిన శ్రీలంక కనీసం 50 పరుగులైన చేయలేదనిపించింది.
|
పేకమేడలా..
లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ప్రతిఘటించడంతో 65 పరుగులు చేయగలిగింది. ఓపెనర్లు చమారి అతపత్తు-6, అనుష్క సంజీవని-2 పరుగులు చేశారు. ఇద్దరూ రనౌట్ అయ్యారు. టాప్ ఆర్డర్ బ్యాటర్ హర్షిత సమర విక్రమ-1, నీలాక్షి డిసిల్వా-6, హాసిని పెరెరా-0, కవిష దిల్హరి-1, ఒషాడె రణసింఘె-13, మల్షా షెహని-0, సుగంధిక కుమారి-6 చేశారు. ఇనోక రణవీర-18, అచిని కలసూరియ-6 పరుగులతో నాటౌట్గా నిలిచారు.
నిప్పులు చెరిగిన బౌలర్లు..
టీమిండియా బౌలర్లల్లో రేణుక సింగ్ మూడు వికెట్లతో చెలరేగిపోయింది. మూడు ఓవర్లల్లో అయిదు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టింది. రాజేశ్వరి గైక్వాడ్, స్నేహ్ రాణా రెండేసి చొప్పున వికెట్లను నేలకూల్చారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా వార్ వన్సైడ్ చేసింది. రెండు వికెట్లు వెంటవెంటనే పడినప్పటికీ.. ఏ మాత్రం అదరలేదు టీమిండియా బ్యాటర్లు.
స్మృతి మంధాన మెరుపులు..
పరుగులు చేయడానికి శ్రీలంక బ్యాటర్లు చెమటోడ్చిన పిచ్పై ఆడుతూ పాడుతూ విజయాన్ని అందుకుంది. 8.3 ఓవర్లల్లో 71 పరుగులు చేసింది. ఈ క్రమంలో రెండు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ షెఫాలి వర్మ-5, టాప్ ఆర్డర్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్-2 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మరో ఓపెనర్ స్మృతి మంధాన రెచ్చి బ్యాటింగ్ చేసింది. భారీ షాట్లతో విరుచుకుపడింది. 25 బంతుల్లో 51 పరుగులను పిండుకుంది. మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుంది.