
హైదరాబాద్: విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ను టీమిండియా ఆడనుంది. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్ వేదికగా జనవరి 5న తొలి టెస్టులో తలపడనుంది.
దక్షిణాఫ్రికాలో బౌన్సీ పిచ్లు కావడంతో ఈ సుదీర్ఘ పర్యటనలో భారత బౌలర్లు టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించనున్నారు. మరోవైపు ఈ సిరిస్ టీమిండియాకు ఎంతో కీలకం. ఇప్పటికే వరుసగా తొమ్మిది టెస్టు సిరిస్లను గెలిచిన కోహ్లీసేన ఈ టెస్టు సిరిస్ను గెలిస్తే చరిత్ర సృష్టిస్తుంది.
దీంతో కోహ్లీసేన నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. వర్షం కారణంగా ఆదివారం ఇండోర్ స్టేడియంలో సాధన చేసిన ఆటగాళ్లు మంగళవారం మైదానంలోనే చెమటోడ్చారు. గత నాలుగు రోజులుగా టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పర్యవేక్షణలో అలసట అనేదే లేకుండా భారత బౌలర్లు నెట్స్లో ప్రాక్టీస్ చేశారు.
మంగళవారం ఈ నెట్ ప్రాక్టీస్లో బౌలర్లు vs బ్యాట్స్మెన్ అన్నట్లు సాగింది. నెట్స్లో భారత బౌలర్లు ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని బీసీసీఐ అభిమానులతో పంచుకుంది. అందులో టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, మురళీ విజయ్ మాకు బ్యాటింగ్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూడటాన్ని మనం చూడొచ్చు.
టీమిండియా ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా గడ్డపై ఒక్క టెస్టు సిరీస్ కూడా కైవసం చేసుకోలేదు. ఆటగాళ్ల ప్రాక్టీస్ ఫొటోలతో పాటు వీడియోను బీసీసీఐ ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం టీమిండియా టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతోంది.