విద్యార్థులకు ఉచిత ప్రవేశం:
మ్యాచ్కు వచ్చే పాఠశాల, కళాశాలల విద్యార్థులకు స్టేడియం అధికారులు ఉచిత ప్రవేశంను కలిపించారు. మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రతి విద్యార్థి తమ ఐడీ కార్డును చూపించి స్టేడియం లోపలకు ప్రవేశించవచ్చు. అయితే విద్యార్థులతో వచ్చే తల్లితండ్రులు మాత్రం టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల కోసం ప్రత్యేక గ్యాలరీ కేటాయించారు. విద్యార్థులను ఎనిమిదో నంబర్ గేటు ద్వారా లోపలకు ఉచితంగా అనుమతిస్తారు. ఇతరుల కోసం మ్యాచ్ జరిగే అన్ని రోజులూ స్టేడియం వద్ద రోజువారి, సీజనల్ టికెట్లను విక్రయిస్తారు.
భారీ బందోబస్తు:
మ్యాచ్ చూడడానికి వచ్చే అభిమానుల కోసం మూడు చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసారు. ఇక మీడియా వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాన్ని కూడా కేటాయించారు. అన్ని గ్యాలరీలో ఫుడ్ స్టాళ్లు అందుబాటులో ఉంటాయి. ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం ఉన్నందున తాగు నీరు గ్యాలరీల్లో అందుబాటులో ఉంటుంది. వెలుతురు లేని సందర్భాల్లో ఫ్లడ్లైట్ల కాంతుల్లో మ్యాచ్ కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. ఇక స్టేడియం వద్ద 900 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఉండనుంది.
అరగంటలో మ్యాచ్ ప్రారంభమయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు:
వైజాగ్లో గత వారం రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. మ్యాచ్ ప్రారంభం అయ్యే బుధవారం నుంచి కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉండనున్నట్లు సమాచారం తెలుస్తోంది. తొలి రోజు 80%, రెండో రోజు 50%, మూడో రోజు 40% వర్షం పడే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది. వర్షం వల్ల మ్యాచ్కు అంతరాయం కలగకుండా 90 శాతం గ్రౌండ్ను టర్పాన్లతో కప్పారు. మ్యాచ్ మధ్యలో వర్షం కురిస్తే.. వాన తగ్గిన వెంటనే అరగంటలో మళ్లీ మ్యాచ్ ప్రారంభమయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
బెంచ్కే పరిమితమైన పంత్:
తొలి టెస్టులో ఆడే భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్పై వేటు పడింది. గత సిరీస్లలో పేలవ బ్యాటింగ్ చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో గాయం నుంచి సీనియర్ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ వృద్ధిమాన్ సాహా పూర్తిగా కోలుకొని ఫిట్నెస్ సాధించడంతో పంత్ బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.
భారత జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అంజిక్య రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ.