టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మున్రో(7) తొలి వికెట్గా పెవిలియన్ చేరగా, ఆపై కాసేపటికి గప్టిల్(13) కూడా ఔటయ్యాడు. దాంతో 26 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కివీస్ కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(28) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.
పాండ్యూ సూపర్ క్యాచ్
అయితే, చాహల్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యా అద్భుత క్యాచ్ పట్టడంతో కెప్టెన్ విలియమ్సన్ నిరాశగా పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాట్స్మెన్ రాణించడంతో న్యూజిలాండ్ మెరుగైన స్థితిలో నిలిపింది. 59 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును మిడిలార్డర్ బ్యాట్స్మెన్ రాస్ టేలర్(81), టామ్ లాథమ్(51) ఆదుకున్నారు.
నాలుగో వికెట్కి 119 పరుగుల భాగస్వామ్యం
ఈ జోడీ నాలుగో వికెట్కి 119 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలోనే ముందుగా రాస్ టేలర్ హాఫ్ సెంచరీ చేయగా, లాథమ్ కూడా హాఫ్ సెంచరీతో మెరిశాడు. 62 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత లాథమ్ నాలుగో వికెట్గా పెవిలియన్కు చేరాడు. భారత స్పిన్నర్ చహల్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన లాథమ్.. అంబటి రాయుడుకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
20 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయిన కివీస్
మరో 13 పరుగుల వ్యవధిలో హెన్రీ నికోలస్(6)ను హార్దిక్ పాండ్యా ఔట్ చేశాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా వేసిన మరో ఓవర్లో శాంటర్న్ పెవిలియన్ చేరాడు. దాంతో 20 పరుగుల వ్యవధిలో కివీస్ మూడు వికెట్లను చేజార్చుకుంది. ఒకవైపు వికెట్లు పడుతుండటంతో స్కోరును పెంచే బాధ్యత రాస్ టేలర్పై పడింది.
సెంచరీ మిస్ చేసుకున్న రాస్ టేలర్
దీంతో సెంచరీకి చేరువగా వచ్చిన రాస్ టేలర్ ఏడో వికెట్గా మహ్మద్ షమీ బౌలింగ్లో దినేశ్ కార్తీక్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. చివర్లో ఒత్తిడికి గురైన ఆ జట్టు ఆఖర్లో వరుసగా వికెట్లు సమర్పించుకుంది. దీంతో 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు సాధించగా, హార్దిక్ పాండ్యా, చహల్, భువనేశ్వర్ కుమార్లు తలో రెండు వికెట్లు తీశారు.