హైదరాబాద్: బంతి పాతబడిన కొద్దీ టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా మరింత మెరుగ్గా బౌలింగ్ చేస్తాడని వెస్టిండీస్ మాజీ పేస్ దిగ్గజం మైకేల్ హోల్డింగ్ అన్నాడు. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా 203 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
టీమిండియా ఈ విజయాన్ని అందుకోవడంలో బుమ్రా కీలకపాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్లో 85 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో బుమ్రాపై మైకేల్ హోల్డింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. మూడో టెస్టు మ్యాచ్ అనంతరం మైకేల్ హోల్డింగ్ మాట్లాడుతూ "బుమ్రా కొత్త బంతితో మాత్రమే రాణించే బౌలర్ కాదు. ఇంగ్లాండ్ సిరీస్కు నేనైతే బుమ్రాను ఎంపిక చేసేవాడిని కాదు. అతను పాత బంతితో బాగా బౌలింగ్ చేయగలడు కానీ కొత్త బంతితో కాదు" అని అన్నాడు.
"భువనేశ్వర్కుమార్ లేని నేపథ్యంలో ఇషాంత్శర్మ, మహ్మద్ షమి ఇందుకు సరైన ప్రత్యామ్నాయం" అని చెప్పుకొచ్చాడు. ఇక, హార్దిక్ పాండ్య ఇంకా పూర్తి స్థాయి టెస్టు ఆల్రౌండర్గా ఎదగలేదని.. అతను మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్దేవ్కు సమీపంగా కూడా లేడని అన్నాడు.
"ఇక పాండ్యా విషయంలో గతంలో నేనేం మాట్లాడానో మళ్లీ ఒక్కసారి పరిశీలించకోవచ్చు. పాండ్యా ఇంకా పూర్తి స్థాయి టెస్టు ఆల్రౌండర్గా ఎదగలేదు. అతనికి కపిల్దేవ్కు పొంతనే లేదు. అతను కపిల్కు సమీపంగా కూడా లేడు" అని హోల్డింగ్ చెప్పాడు.
ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆతిథ్య ఇంగ్లాండ్తో ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడుతోంది. ఇప్పటివరకు ముగిసిన మూడు టెస్టుల్లో టీమిండియా 1-2తో వెనుకంజలో ఉంది. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు ఆగస్టు 30న సౌతాంప్టన్ వేదికగా ప్రారంభం కానుంది.