బంతి రెండు వైపులా
"నాలుగో టెస్టులో బంతి రెండు వైపులా తిరిగింది. ఎడమచేతి వాటం బౌలర్, ముగ్గురు సీమర్లు ఉండటం కలిసొచ్చింది. ఈ పిచ్పై పరిస్థితి ఎప్పటికైనా తారుమారు అవుతుందని తెలుసు. మంచి ఆటగాళ్లు నా జట్టులో ఉండటంతో మ్యాచ్ ఇటువైపు మారింది. ఈ సిరీస్లో ఒక జట్టుగా మేమంతా చక్కగా రాణించాం" అని రూట్ వెల్లడించాడు. ఈ సిరీస్లో ఇరు జట్లు ఒడుదొడుకులకు లోనయ్యాయని, పిచ్లు బ్యాట్స్మెన్కు సవాల్గా మారాయని జో రూట్ తెలిపాడు.
245 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి
ఆదివారం 245 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే తడబడింది. 22 పరుగులకే టాప్ ఆర్డర్ పెవిలియన్లో కూర్చుంది. ఈ దశలో జట్టును కెప్టెన్ కోహ్లీ, రహానే ఆదుకున్నారు. ధావన్ (17), రాహుల్ (0), పుజారా (5) పేలవ షాట్లకు మూల్యం చెల్లించుకున్నారు. నాలుగో ఓవర్లోనే రాహుల్ను బ్రాడ్ అవుట్ చేశాడు. ఇక ఆండర్సన్ బౌలింగ్లో ధావన్ స్లిప్లో క్యాచ్ ఇవ్వగా.. పుజారా ఎల్బీగా వెనుదిరిగాడు.
అంపైర్ నిర్ణయంపై డీఆర్ఎస్ కోరిన పుజారా
అయితే అంపైర్ నిర్ణయంపై అతడు డీఆర్ఎస్ కోరినా ఫలితం దక్కలేదు. ఈ సమయంలో కోహ్లీ (58), రహానే (51) హాఫ్ సెంచరీలతో రాణించడంతో పాటు నాలుగో వికెట్కు 101 పరుగులు జత చేశారు. భారీ షాట్లకు వెళ్లకుండా సింగిల్స్ కోసమే ప్రయత్నించారు. ఈక్రమంలో కోహ్లీ 114 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ జోడీ మధ్య చక్కటి భాగస్వామ్యం ఏర్పడుతూ కుదురుకున్న దశలో మొయిన్ అలీ గట్టి షాక్ ఇచ్చాడు.
నాలుగో వికెట్కు 101 పరుగుల భాగస్వామ్యం
51వ ఓవర్లో బంతి కోహ్లీ గ్లోవ్స్కు తగిలి షార్ట్ లెగ్లో కుక్ చేతిలో పడింది. అయితే కోహ్లీ రివ్యూకు వెళ్లగా ఈసారి అతడికి ప్రతికూలంగానే నిర్ణయం వచ్చింది. దీంతో నాలుగో వికెట్కు 101 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. టీ విరామం తర్వాత భారత్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. చివరి వికెట్కు అశ్విన్ (25) పరుగులు జోడించినప్పటికీ రెండో ఇన్నింగ్స్లో 69.4 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది.
సెప్టెంబర్ 7 నుంచి ఓవల్ వేదికగా చివరి టెస్టు
ఇంగ్లాండ్ బౌలర్లలో అలీకి నాలుగు, ఆండర్సన్.. స్టోక్స్లకు రెండేసి వికెట్లు దక్కాయి. అంతకుముందు ఇంగ్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 96.1 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో షమీ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఇరు జట్ల మధ్య చివరి టెస్టు సెప్టెంబర్ 7 నుంచి లండన్లోని ఓవల్ వేదికగా జరగనుంది.