టీ20 సిరీస్లో చోటు:
దేశవాళీ క్రికెట్లో సత్తాచాటిన ఆటగాళ్లకు సెలక్షన్ కమిటీ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఫిట్నెస్, క్రమశిక్షణ లోపాలతో జట్టుకు దూరమయిన శాంసన్.. విజయ్ హజారే ట్రోఫీలో 212 పరుగులతో సత్తా చాటాడు. దీంతో 4 ఏళ్ల తర్వాత టీమిండియా నుంచి అతనికి మళ్లీ పిలుపొచ్చింది. బంగ్లాదేశ్తో జరగబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో శాంసన్కు చోటు దక్కింది. చివరగా అతడు 2015లో జింబ్వాబేలో జరిగిన టీ20 సిరీస్లో ఆడాడు.
నువ్వెంటో నిరూపించుకో:
టీ20 సిరీస్లో శాంసన్ ఎంపికవడంతో అతనిపై ప్రశంసలు కురుస్తున్నాయి. చాలా కాలంగా సంజు శాంసన్ను జాతీయ జట్టులోకి ఎంపిక చేయాలని గంభీర్ అంటున్న విషయం తెలిసిందే. చివరకు తన మాట నెగ్గడంతో ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేసాడు. అంతేకాదు శాంసన్కు ఓ సూచన కూడా చేసాడు. 'శాంసన్ చాలా గ్యాప్ తర్వాత అవకాశం దక్కించుకున్నాడు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. టీ20 జట్టులో ఎంపికైనందుకు అభినందనలు. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకో. నువ్వెంటో నిరూపించుకో' అని రాసుకొచ్చాడు.
సంజు డబుల్ సెంచరీ:
'దేశీయ వన్డే గేమ్లో సంజు డబుల్ సెంచరీ సాధించాడు. మంచి ప్రతిభతో ఆకట్టుకున్నాడు. ప్రతిభ ఉంటే త్వరగానే అవకాశాలు వస్తాయి' అని గోవాపై 212 పరుగులు చేసిన తర్వాత గంభీర్ ట్వీట్ చేశాడు. ఇటీవలి కాలంలో శాంసన్ అద్భుత ఆటతో ఆకట్టుకున్నాడు. దీంతో టీ20 ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని అతనికి సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే.. ప్రస్తుతం జట్టులో ఉన్న వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇంకా కుదురుకోలేదు.
ప్రపంచకప్ నా కల:
శాంసన్ మాట్లాడుతూ... 'నేను చాలా సంతోషంగా ఉన్నా. ప్రపంచంలోనే అత్యుత్తమమైన భారత జట్టులోకి రావడానికి చాలా కష్టపడ్డాను. జట్టు అవసరాల కోసం టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఎక్కడైనా ఆడుతా. నా దేశం కోసం ప్రపంచకప్లో ఆడడం, కప్ గెలవడమే నా కల. అయితే ఇది ఏ సంవత్సరంలో జరుగుతుందో నాకు తెలియదు. ఐదేళ్లలో మానసికంగా, సాంకేతికంగా నాలో ఎన్నో మార్పులు వచ్చాయి. నా బలాలపై మరింత దృష్టి పెట్టా. ఎప్పుడూ పరిపూర్ణ బ్యాట్స్మన్ అవ్వాలని ప్రయత్నించలేదు. ఎందుకంటే.. పరిపూర్ణులు ఎవరూ ఉండరు' అని అన్నాడు.