47 పరుగుల తేడాతో ఓడిన భారత్
2007లో టీమిండియాను ఆస్ట్రేలియా 47 పరుగుల తేడాతో ఓడించింది. మరో రెండేళ్ల తర్వాత జరిగిన మ్యాచ్లో షాన్మార్ష్ సెంచరీ సాధించడంతో ఆసీస్ మూడు పరుగుల తేడాతో విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో తొలి వన్డేను కోహ్లీసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే టీ20 సిరిస్ను 0-2తో చేజార్చుకున్న టీమిండియా వన్డే సిరిస్ను గెలుపుతో ఆరంభించాలని భావిస్తోంది.
ఉప్పల్లో రికార్డుని మెరుగుపరచుకోవాలని
దీంతో పాటు ఉప్పల్ స్టేడియంలో తమకు రికార్డుని మెరుగు పరచుకోవాలని కోహ్లీసేన గట్టి పట్టుదలతో ఉంది. ఆస్ట్రేలియాతో చివరగా తలపడిన ఏడు వన్డేల్లో భారత క్రికెట్ జట్టు ఆరింట విజయం సాధించింది. దీంతో ఉప్పల్ మైదానంలో 12 ఏళ్ల రికార్డును కోహ్లీసేన బద్దలు చేస్తుందేమో చూడాలి. మరోవైపు తొలి వన్డేలో టీమిండియా మాజీ కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆడటంపై అనుమానం నెలకొంది.
తొలి వన్డేకు ధోని అనుమానమే!
ఆసీస్తో జరగబోయే తొలి వన్డే కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ధోని గాయపడ్డాడు. నెట్స్లో ధోని బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తోన్న సమయంలో సపోర్ట్ స్టాఫ్ సభ్యుడైన రాఘవేంద్ర విసిరిన బంతి ధోని కుడి చేతికి బలంగా తాకింది. అనంతరం వెంటనే ధోని విపరీతమైన నొప్పితో విలవిల్లాడు. అప్పటికే చాలా సేపటి నుంచి నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న ధోని.... గాయపడిన వెంటనే ముందు జాగ్రత్తగా నెట్స్ నుంచి వెళ్లిపోయాడు.
ధోని స్థానంలో రిషబ్ పంత్!
అయితే, ధోనికి అయిన గాయం తీవ్రత మాత్రం తెలియరాలేదు. తొలి వన్డేలో ధోని ఆడతాడా లేదా అన్నది శుక్రవారం సాయంత్రంలోగా తేలనుంది. ఒకవేళ తొలి వన్డేకి ధోని దూరమైతే అతడి స్థానంలో రిషబ్ పంత్కు తుది జట్టులో చోటు కల్పించాలనే ఆలోచనలో జట్టు మేనేజ్మెంట్ ఉంది. భారత కాలమానం ప్రకారం తొలి వన్డే మధ్యాహ్నాం 1.30 గంటలకు ప్రారంభం కానుంది.