అడిలైడ్: పరాజయం పరిపూర్ణం. తొలి టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు ఘన విజయాన్ని అందుకుంది. క్రీజ్లో దిగిన గంటలోపే మ్యాచ్ను ముగించేసింది. భారత జట్టు నిర్దేశించిన 90 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఆసీస్..ఛేదించింది. ఈ క్రమంలో రెండు వికెట్లను మాత్రమే కోల్పోయింది. ఓపెనర్ జో బర్న్స్ దూకుడుగా ఆడాడు. 63 పరుగులకే అర్దసెంచరీ పూర్తి చేశాడు. ఓపెనర్ కమ్ కేప్టెన్ మాథ్యూ వేడ్ 33 పరుగులు చేశాడు. నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో బోణీ కొట్టింది ఆసీస్. 1-0 తేడాతో ఆధిపత్యాన్ని సాధించింది.
అంతకుముందు రెండో ఇన్నింగ్లో ఆస్ట్రేలియా..భారత జట్టును 36 పరుగులకే పరిమితం చేసింది. ఒక వికెట్ నష్టానికి తొమ్మది పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో మూడోరోజు ఇన్నింగ్ను ఆరంభించిన కోహ్లీసేన.. ఆసీస్ పేసర్ల ధాటికి కుప్పకూలింది. కనీస ప్రతిఘటన ఇవ్వలేకపోయింది. 11వ ఓవర్లో రెండో బంతికి చేతేశ్వర్ పుజారా అవుటైన తరువాత ప్రారంభమైన వికెట్ల పతనం. బ్రేకుల్లేకుండా సాగింది. చివరి తొమ్మిది వికెట్లను 27 పరుగులకే కోల్పోయింది. ఈ క్రమంలో రెండు చెత్త రికార్డులను నమోదు చేసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 19 పరుగులకు ఆరు వికెట్లను కోల్పోయిన జట్టు ఇప్పటిదాకా ఏదీ లేదు.
టీమిండియా నిర్దేశించిన లక్ష్యం చిన్నదే కావడంతో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఎక్కడా తొట్రు పడలేదు. తడబాటును ప్రదర్శించలేదు. దూకుడుగా ఇన్నింగ్ను ఆరంభించారు. లక్ష్యానికి చేరువగా ఉన్న సమయంలో ఓపెనర్ మాథ్యూ వేడ్ అవుట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 70 పరుగులు. మరో 12 పరుగులు జోడించిన తరువాత.. మార్ముస్ లంబుషెన్ అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ జో బర్న్స్ తనదైన శైలిలో రెచ్చిపోయి ఆడాడు. 63 పరుగులకే 51 పరుగులు చేశాడు. ఏడు ఫోర్లు, ఒక సిక్స్ నమోదు చేశాడు.
ఈ దారుణ ఓటిమిపై మాజీ క్రికెటర్లు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ప్రత్యర్థి జట్టును ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అద్భుతమైన బౌలింగ్ చేశారని ఆకాశానికెత్తేస్తున్నారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అఖ్తర్.. టీమిండియాపై సెటైర్ల మీద సెటైర్లు సంధించాడు. కాస్త ఆలస్యంగా నిద్రలేచిన తాను అడిలైడ్ టెస్ట్ మ్యాచ్ స్కోర్ బోర్డును చూసి భారత జట్టు 369 పరుగులు చేసిందనుకున్నానని, నమ్మలేక కళ్లు నులుముకుని చూడగా.. మధ్యలో అడ్డగీత కనిపించిందని వ్యాఖ్యానించాడు.
టెస్టు మ్యాచ్లల్లో పాకిస్తాన్ నమోదు చేసిన అత్యల్ప స్కోరును టీమిండియా బద్దలు కొట్టడం తనకు సంతోషాన్ని ఇస్తోందని వ్యాఖ్యానించాడు. ఓ ప్రొఫెషనల్ క్రికెటర్గా బాధ కలిగిస్తోందని అన్నాడు. టీమిండియా వంటి జట్టు తన స్థాయికి ఆడకపోతే ఇలాంటి ఫలితాలే వస్తాయని పేర్కొన్నాడు. మరో మాజీ క్రికెటర్, లెజెండరీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ ఈ ఓటమిపై స్పందించాడు. మ్యాచ్ ఇంత త్వరగా ముగిసిపోతుందని తాను అనుకోలేదని చెప్పాడు. రెండో ఇన్నింగ్లో భారత జట్టు కనీస ప్రతిఘటన ఇవ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అన్నాడు.
రెండో ఇన్నింగ్ ఆస్ట్రేలియా బౌలర్లు సాగించిన జైత్రయాత్రను ఇప్పట్లో ఎవరూ విస్మరించలేరని డేవిడ్ వార్నర్ వ్యాఖ్యానించాడు. వారి టాలెంట్కు ఈ ఇన్నింగ్ అద్దం పట్టిందని పేర్కొన్నాడు. హేజిల్వుడ్ 200 వికెట్ల క్లబ్లో చేరడం పట్ల ఆసీస్ మాజీ స్పీడ్స్టర్ మెక్గ్రాత్ హర్షం వ్యక్తం చేశాడు. ఇలాంటి అద్భుత విజయం, ప్రతిభతో 200 వికెట్ల క్లబ్లో రావడం ఏ బౌలర్కయినా ఆనందాన్ని ఇస్తుందని వ్యాఖ్యానించాడు. టీమిండియా బ్యాట్స్మెన్ల స్కోరును మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కొత్త ఓటీపీ నంబర్గా అభివర్ణించాడు. ఇంత పెద్ద ఓటీపీ నంబర్ను గుర్తుపెట్టుకోవడం కష్టం అంటూ ఎద్దేవా చేశాడు.