

హైదరాబాద్: రెండు టీ20ల సిరిస్లో పర్యాటక జట్టు శుభారంభం చేసింది. విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 127 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. ఆసీస్కు నిర్దేశించిన పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునేందుకు భారత బౌలర్లు కఠోరంగా శ్రమించారు. ఆఖరి ఓవర్లో ఆసీస్ విజయానికి 14 పరుగులు అవసరం కాగా కమిన్స్ (7), రిచర్డ్సన్ (7) చెరో బౌండరీ బాది ఆ జట్టుకు విజయం అందించారు. దీంతో రెండు టీ20ల సిరిస్లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో ఉంది.
భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీయగా... చాహల్, పాండ్యాలకు చెరో వికెట్ లభించింది. ఈ మ్యాచ్లో భారత్ నిర్దేశించిన 127 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను ఆరంభంలోనే భారత బౌలర్లు 5 పరుగులకే 2 వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బకొట్టారు. స్టొయినిస్ (1), ఫించ్ (0) సింగిలి డిజిట్కే పెవిలియన్ చేరారు.
అనంతరం క్రీజులోకి వచ్చిన మ్యాక్స్వెల్ (56) హాఫ్ సెంచరీ ఆసీస్ జట్టుని రేసులోకి తీసుకొచ్చాడు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి తోడుగా ఓపెనర్ డీఆర్సీ షార్ట్ (37) ఫరవాలేదనిపించాడు. వీరిద్దరూ మూడో వికెట్కు 84 పరుగులు జోడించారు.
ఆ తర్వాత చాహల్ బౌలింగ్లో మ్యాక్స్వెల్ ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే షార్ట్ కూడా వెనుదిరిగాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. 19వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం 2 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. దీంతో ఆఖరి ఓవర్కు ఆసీస్ విజయానికి 14 పరుగులు అవసరమయ్యాయి. ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో కమిన్స్ (7), రిచర్డ్సన్ (7) చెరో బౌండరీ బాది ఆ జట్టుకు విజయాన్ని అందించారు.
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. బెహ్రెన్డోర్ఫ్ వేసిన మూడో ఓవర్ మూడో బంతికి ఓపెనర్ రోహిత్ శర్మ(5) అడమ్ జంపాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.
అనంతరం కేఎల్ రాహుల్తో కలిసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్కి 55 పరుగులు జోడించారు. ఆ తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో ఆడం జంపా బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి విరాట్ కోహ్లీ(24) కౌంటర్ నైల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఆ తర్వాత కాసేపటికి రిషభ్ పంత్(3) అనవసరపు పరుగు కోసం యత్నించి రనౌటయ్యాడు. డీ ఆర్షీ షాట్ వేసి పదో ఓవర్ చివరి బంతికి రిషబ్ అత్యంత చెత్తగా రనౌటై వెనుదిరిగాడు. దాంతో భారత్ 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అటు తర్వాత కేఎల్ రాహుల్(50) హాఫ్ సెంచరీ సాధించి ఔటయ్యాడు.
అనంతరం బ్యాటింగ్కి వచ్చిన దినేశ్ కార్తీక్(1), కృనాల్ పాండ్యా(1) స్వల్ప స్కోర్కే పెవిలియన్కు చేరారు. చివర్లో ధోనీ.. పరుగులు సాధించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. క్రీజులో ధోని(29 నాటౌట్) కడవరకూ ఉండటంతో భారత్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్లలో ఆరుగురు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ కౌల్టర్ నైల్ మూడు వికెట్లు సాధించగా, ఆడమ్ జంపా, ప్యాట్ కమిన్స్ బెహ్రన్డార్ఫ్లు తలో వికెట్ తీశారు.