అతి జాగ్రత్తే మా కొంప ముంచింది.. ఆస్ట్రేలియాపై అలా ఆడాల్సింది కాదు: కోహ్లీ

ముంబై: ఇటీవలి కాలంలో సొంతగడ్డపై వరుస విజయాలతో దూసుకెళుతున్న టీమిండియాకు ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. ఈ ఏడాది ఆడిన తొలి వన్డేలోనే కోహ్లీ సేనకు భారీ షాక్ తగిలింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ముంబైలోని వాంఖడే మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (112 బంతుల్లో 128 నాటౌట్; 17 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆరోన్ ఫించ్ (114 బంతుల్లో 110 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో ఆసీస్ వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది.

అన్ని విభాగాల్లో విఫలం అయ్యాం:
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'ఈ మ్యాచ్లో అన్ని విభాగాల్లో విఫలం అయ్యాం. బలమైన ఆస్ట్రేలియాపై సరిగ్గా ఆడకపోతే వాళ్లు ఓడిస్తారు. ఈ విషయం మా బ్యాటింగ్ ద్వారా అర్థమైంది. మ్యాచ్లో కొన్ని సందర్భాల్లో మేం అతి జాగ్రత్తగా ఆడాం. అదే మా కొంప ముంచింది. ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్టుతో అలా ఆడాల్సింది కాదు. టీమిండియా ఇప్పుడు కోలుకోవాల్సిన సమయం ఉంది' అని అన్నాడు.

ఆస్ట్రేలియాకే క్రెడిట్:
'ఆస్ట్రేలియా బాగా ఆడింది. బౌలింగ్, బ్యాటింగ్ అమోఘం. ఆస్ట్రేలియాకే క్రెడిట్ దక్కుతుంది. అంతర్జాతీయ క్రికెట్ ఎప్పుడూ వెల కట్టలేనిది. ఏ ఫార్మాట్లో అనుభవమున్నా.. అది ఇతర ఫార్మాట్లలో ఆడేటప్పుడు కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఒక బ్యాట్స్మన్ ఏదైనా ఫార్మాట్లో అత్యుత్తమంగా రాణిస్తే.. మిగతా ఫార్మాట్లలోనూ ఆడగలమనే నమ్మకం కలుగుతుంది. ఆసీస్ ఇటీవల టెస్టుల్లో అద్భుత విజయాలు సాధించింది. ఈ రోజు కూడా పైచేయి సాధించింది. మేం ఏ సందర్భంలోనూ ఆసీస్పై ఆధిపత్యం చెలాయించ లేకపోయాం' అని కోహ్లీ తెలిపాడు.

ప్రయోగాలు బెడిసికొట్టాయి:
'కేఎల్ రాహుల్ ఆడుతున్న తీరు చూసే అతడిని వన్డౌన్లో పంపించాలని అనుకున్నాం. అయితే మేం అనుకున్న విధంగా జరగలేదు. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులపై పునరాలోచన చేస్తాం. ఈ ఓటమి వాస్తవాలను గుర్తించేలా చేసింది. ఈ ఒక్క మ్యాచ్తో అభిమానులంతా కంగారు పడాల్సిన అవసరం లేదు. నేనింకా ప్రయోగాలు చేసే అవకాశముందని భావిస్తున్నా. రెండో వన్డేలో తప్పులను సరిదిద్దుకుంటాం' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

రాజ్కోట్లో రెండో మ్యాచ్:
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 49.1 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌటైంది. శిఖర్ ధావన్ (91 బంతుల్లో 74; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా.. కేఎల్ రాహుల్ (61 బంతుల్లో 47; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. మిచెల్ స్టార్క్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఆ్రస్టేలియా 37.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 258 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' వార్నర్, ఫించ్ అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించారు. సిరీస్లో ఆసీస్ 1-0తో ముందంజ వేసింది. రెండో మ్యాచ్ ఈ నెల 17న రాజ్కోట్లో జరుగుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications