గెలుపు కోసమే బీసీసీఐ డే/నైట్ టెస్టుకు ఒప్పుకోవడం లేదు: సీఏ కవ్వింపు

హైదరాబాద్: ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించి భారత్ షెడ్యూల్ వచ్చిందో లేదో ఇరు దేశాలకు చెందిన బోర్డుల మధ్య అప్పుడే మాటల యుద్ధం మొదలైంది. క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ జేమ్స్ ఓ రేడియో చానెల్ ఇంటర్వ్యూలో బీసీసీఐని కవ్విస్తూ మాట్లాడాడు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు అడిలైడ్ వేదికగా జరగనుంది.
ఈ టెస్టు మ్యాచ్ని గులాబీ బంతితో డే/నైట్ టెస్టుగా నిర్వహించాలని ఆస్ట్రేలియా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే తాజాగా బీసీసీఐ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించింది. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ జేమ్స్ సదర్లాండ్ మాట్లాడుతూ ఆసీస్ పర్యటనలో గెలుపు కోసమే బీసీసీఐ డే/నైట్ టెస్టుకు ఒప్పుకోవడం లేదని, భవిష్యత్తులో టెస్టుల పరిస్థితి గురించి ఆలోచించడం లేదని అన్నాడు.

కూకబుర్రా బంతులతో డే/నైట్ టెస్టు
మ్యాచ్ల షెడ్యూల్ను ఖరారు చేయడంలో ఆతిథ్య దేశానికే ఎక్కువ స్వేచ్ఛ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఎప్పుడు, ఎక్కడ ఆడాలనేది ఆతిథ్య దేశం నిర్ణయానికే వదిలేయాలని సూచించారు. ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్టులంటే ఇప్పటి వరకు గులాబీ రంగు కూకబుర్రా బంతులతోనే జరుగుతున్నాయి. దీని నాణ్యతపై బీసీసీఐ మొదటినుంచి వ్యతిరేకంగానే ఉంది.

భారత్ గులాబి బంతితో ఆడదు
ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్టుపై బీసీసీఐ పాలక కమిటీ చీఫ్ వినోద్ రాయ్ని సంప్రదించగా ఆయన కాస్త ఘాటుగానే స్పందించారు. 'ఇప్పటికే దానిపై మా వైఖరిని వెల్లడించాం. బీసీసీఐ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందని నేననుకోను. ఫస్ట్క్లాస్ స్థాయిలో డే/నైట్ విధానంలో గులాబి బంతి మ్యాచ్లు ఆడించాలని ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోలేం. దులీప్ ట్రోఫీని మరోసారి ఫ్లడ్లైట్ల వెలుతురులో నిర్వహిస్తాం. మేం తీసుకున్న నిర్ణయం రెండు బోర్డుల మధ్య మనస్పర్ధలకు తావిస్తుందని అనుకోను. ఏం జరిగినా పరస్పర అంగీకారంతోనే జరుగుతుంది. భారత్ గులాబి బంతితో ఆడదు' అని ఆయన స్పష్టం చేశారు.

భారత్ ఇప్పటికే విజయంపై దృష్టి సారించింది
‘భారత్ ఇప్పటికే విజయంపై దృష్టి సారించింది. కానీ మేం భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం. ఇప్పటి వరకు స్వదేశంలో ఆడిన అన్ని పింక్ బాల్ టెస్టులను ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇప్పుడు ఇక్కడ ఆడితే ఆసీస్కు అనుకూలంగా ఉంటుందని భారత్ అనుకుంటోంది' అని జేమ్స్ సదర్లాండ్ అన్నాడు.

అవును, మేం గెలవాలని అనుకుంటున్నాం
గెలవడం కోసమే ఆడమంటున్నారని సదర్లాండ్ పేర్కొన్న వ్యాఖ్యలపై బీసీసీఐ అధికారి స్పందించారు. ‘అవును, మేం గెలవాలని అనుకుంటున్నాం. గెలవడంలో తప్పేముంది' అని అన్నారు. బాల్ ట్యాంపరింగ్కు పాల్పడిన ఆటగాళ్లపై కూడా ఈ సందర్భంగా సదర్లాండ్ స్పందించారు. ‘ట్యాంపరింగ్ వివాదంలో శిక్ష పడిన స్మిత్, వార్నర్, బాన్క్రాఫ్ట్లు తిరిగి జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశాలున్నాయి. ఆటను మరింత మెరుగుపర్చుకొని తమ విలువేమిటో సెలక్టర్లకు తెలపాలి. వాళ్లపై నాకు సానుభూతి ఉంది. వాళ్ల క్షమాపణల్ని మన్నించాం. తిరిగి వాళ్లందరినీ జాతీయ జట్టులో చూడాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications