దక్షిణాఫ్రికాతో జరగనున్న 5 టీ20ల సిరీస్లో కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతినిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకోవడాన్ని భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ తప్పుపట్టాడు. ఇకపోతే ఐపీఎల్ - 2022లో పాయింట్ల పట్టికలో రోహిత్ శర్మ కెప్టెన్సీ వహించిన ముంబై ఇండియన్స్ అట్టడుగు స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో రోహిత్ బ్యాటింగ్లో కూడా విఫలమయ్యాడు. అతను 14మ్యాచ్లలో 268పరుగులు మాత్రమే చేశాడు. అతని ఇన్నింగ్స్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా సిరీస్కు రోహిత్ విరామం తీసుకోవడంలో ఎలాంటి కారణం లేదని ఆర్పీ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఆర్పీ సింగ్ మాట్లాడుతూ.. 'అతను దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆడాలని నేను కోరుకుంటున్నాను. విశ్రాంతి తీసుకోవాలా వద్దా అనేది అతని వ్యక్తిగత నిర్ణయం. అతను అలసిపోయానని భావిస్తే అతనే విరామం తీసుకుంటాడు. కానీ బీసీసీఐ విరామమివ్వడం ఎందుకు. అతనికి విరామం అవసరం ఉందని నేను అనుకోను. అతను ఆడాలి. ఇది చాలా కీలక సిరీస్. అతను కెప్టెన్ అనే విషయం కూడా గుర్తుంచుకోవాలి' అని ఇండియా టీవీలో ఒక ఇంటరాక్షన్ సందర్భంగా ఆర్పీ సింగ్ అన్నాడు.
రోహిత్ పేలవమైన ఫామ్ గురించి ఆర్పీ సింగ్ మాట్లాడుతూ.. గత మూడు, నాలుగు సీజన్లుగా ఐపీఎల్లో నిలకడ లేమి బ్యాటింగ్తో రోహిత్ నిరాశపరుస్తున్నాడని తెలిపాడు. ఐపీఎల్లో రోహిత్ గత కొన్ని సీజన్లలో 400కంటే ఎక్కువ పరుగులు చేయలేదు. ఐపీఎల్లో 400పరుగుల మార్క్ను దాటిన వారు చాలా మంది ఉన్నారు. ఇక ఐపీఎల్లో అతని ప్రదర్శన అస్థిరంగా ఉంది. కానీ ఒకట్రెండు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ మాత్రం రోహిత్ ఆడాడు. పొట్టి ఫార్మాట్లో మనకు రోహిత్ లాంటి మ్యాచ్ విన్నర్లే కావాలి. వారు ఒకట్రెండు మ్యాచ్లు ఆడినా వాటిల్లో జట్టు గెలుస్తుంది' అని ఆర్పీ అభిప్రాయపడ్డాడు. రోహిత్ గైర్హాజరీలో దక్షిణాఫ్రికాతో జరిగే 5టీ20ల సిరీస్కు టీమిండియా పగ్గాలు కేఎల్ రాహుల్ చేపట్టనున్నాడు. జూన్ 9న గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 జరగనుంది.
దక్షిణాఫ్రికా T20 సిరీస్కు ఎంపికైన టీమిండియా టీ20 జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్)(వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ చాహల్ , అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్