తాహిర్ అప్పీల్ చేసినా:
న్యూజిలాండ్ ఎన్ని అవకాశాలు ఇచ్చినా దక్షిణాఫ్రికా సద్వినియోగం చేసుకోలేదు. చేజేతులారా దక్షిణాఫ్రికా మ్యాచ్ను దూరం చేసుకుంది. ఫీల్డింగ్ వైఫల్యాలు, రనౌట్ వదిలేయడంతో పాటు కీలకమైన సమయంలో ప్రొటీస్ పెద్ద తప్పిదం చేసింది. స్టార్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ చివరి ఓవర్ చివరి బంతి విలియమ్సన్ బ్యాట్ను తాకుతూ కీపర్ డి కాక్ చేతుల్లో పడింది. వెంటనే తాహిర్ అప్పీల్ చేసినా.. అంపైర్ ఔట్ ఇవ్వలేదు.
విలియమ్సన్ ఔట్ అయ్యేవాడే:
మరోవైపు కీపర్ డి కాక్ కనీసం స్పందించలేదు. తర్వాత రీప్లేలో విలియమ్సన్ ఔటయ్యేవాడని తేలింది. అప్పుడు కివీస్ విజయానికి (67 బంతుల్లో) 69 పరుగులు కావాలి. డి కాక్ స్పందించి ఉంటే విలియమ్సన్ ఔట్ అయ్యేవాడే. అప్పుడు మ్యాచ్ సఫారీల చేతుల్లోకి వచ్చేది. ఇదేసమయంలో దక్షిణాఫ్రికాకు ఒక రివ్యూ కూడా ఉంది. డి కాక్ అప్రమత్తంగా ఉండిఉంటే.. అంపైర్ ఔట్ ఇవ్వకున్నా రివ్యూ ద్వారా అయినా ఫలితం వచ్చేది. డి కాక్ ఏమరుపాటు వలెనే విలియమ్సన్ చివరి వరకు క్రీజులో ఉండి విజయాన్ని అందించాడు. ప్రస్తుతం డి కాక్పై విమర్శల వర్షం కురుస్తోంది.
ధోనీ కూడా తప్పిదం చేసాడు:
అయితే ఎంతటి ఆటగాడు అయినా పొరపాట్లు చేస్తాడు. డీఆర్ఎస్ను 'ధోనీ రివ్యూ సిస్టం' గా పిలుస్తారు. ఎందుకంటే డీఆర్ఎస్లో ఏదైనా తప్పు ఉంటుందో ఏమోకానీ.. ధోనీ నిర్ణయంలో మాత్రం ఎలాంటి తప్పు ఉండదు. అలాంటి ధోనీ కూడా పాకిస్తాన్ మ్యాచ్లో తప్పిదం చేసాడు. చహల్ బౌలింగ్లో ఓ బంతి పాక్ బ్యాట్స్మన్ బాబర్ అజాం పాడ్స్ ను తాకింది. చహల్ కెప్టెన్ కోహ్లీని రివ్యూ కోరగా.. అతను ధోనీ సలహా అడిగాడు. ధోనీ నిరాకరించడంతో కోహ్లీ రివ్యూకి వెళ్ళలేదు. నిజానికి అజాం ఔట్. విలియమ్సన్లా అజాం మ్యాచ్ ముగించలేదు అంతే. ధోనీ అంచనాలు కూడా తప్పుగా నిరూపించబడ్డాయి. డి కాక్ను నిందించడం సరికాదు అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
డికాక్ను అడిగా:
మ్యాచ్ అనంతరం డూప్లెసిస్ మాట్లాడుతూ... 'నిజంగా క్యాచ్ గురించి తెలియదు. ఆ సమయంలో నేను లాంగాన్లో ఫీల్డింగ్ చేస్తున్నాను. తాహిర్ అప్పీలు చేసినా కూడా.. మేం చేయలేదు. అప్పటికి కీపర్ డికాక్ను అడిగాను. అది ఔట్ అని మ్యాచ్ అనంతరమే తెలిసింది. విలియమ్సన్ కూడా ఔటైనట్లు కనిపించలేదు. ఇదే మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపిందని మాత్రం అనుకోవడం లేదు' అని తెలిపారు.