హైదరాబాద్: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్కప్లో పాక్తో మ్యాచ్ను బహిష్కరించాలని సూచించిన గంగూలీ.. ఒక్క క్రికెట్ అనే కాదు హాకీ, ఫుట్బాల్ తదితర గేమ్స్ దాయాది దేశంతో భారత్ ఆడకూడదని సూచించిన సంగతి తెలిసిందే.
వరల్డ్కప్లో భారత్-పాక్ మ్యాచ్: కపిల్ దేవ్ ఏమన్నాడో తెలుసా?
ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి వరల్డ్కప్ మొదలుకానుండగా ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జూన్ 16 భారత్-పాక్ జట్ల మధ్య మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇదిలా ఉండగా గంగూలీ చేసిన వ్యాఖ్యలను మియాందాద్ ఘాటుగా స్పందించాడు.
"సౌరవ్ గంగూలీ రాబోవు ఎన్నికల్లో పోటీచేయాలని ఆశపడుతున్నాడేమో? ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్నారు. అందుకే ప్రచారం కోసం 'మ్యాచ్ బహిష్కరణ' వ్యాఖ్యలు చేసి అందర్నీ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. పుల్వామా దాడి తర్వాత భారత్ వ్యవహరిస్తున్న తీరుపై మాకేమీ చింతలేదు. మనం అభివృద్ధి మీద దృష్టి సారించాలి. భారత్తో సత్సంబంధాల కోసం పాక్ ఎప్పుడూ ముందుంటుంది. కానీ భారతే సరిగ్గా స్పందించడం లేదు" అని అన్నాడు.
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఇటీవల గంగూలీ ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో "ప్రపంచకప్లో మొత్తం పది జట్లు పాల్గొంటాయి. ప్రతి జట్టూ మరో జట్టుతో ఆడుతుంది. కాబట్టి పాక్తో మ్యాచ్ ఆడకపోతే భారత్కు ఎలాంటి నష్టం జరగదు. భారత్ సహకారం లేకుండా ఐసీసీ ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్లో ముందుకు వెళ్లడం కష్టం. ఏదేమైనప్పటికీ పాకిస్థాన్కు కచ్చితంగా గట్టి సందేశం పంపాల్సిన అవసరముందని భావిస్తున్నా" అన్న సంగతి తెలిసిందే.
మరోవైపు ఉగ్రవాద సంస్థలతో పాకిస్థాన్కు సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఆ జట్టును ప్రపంచకప్ నుంచి నిషేధించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇదొక పనికిమాలిన, హాస్యాస్పద చర్యగా మియాందాద్ పేర్కొన్నారు. "బీసీసీఐ తీసుకునే చర్యలను ఐసీసీ సమ్మతించదు. ఐసీసీకి బీసీసీఐ మాటలు వినాల్సిన అవసరమే లేదు. ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్లలో దాని సభ్యత్వ దేశాలకు కచ్చితంగా పాల్గొనే హక్కు ఉంటుంది" అని మియాందాద్ అన్నారు.